
- రాష్ట్రాన్ని రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాయి: కిషన్రెడ్డి
- పదేండ్లలో బంగారు తెలంగాణ కాలే.. కేసీఆర్ కుటుంబమే బంగారమైంది
- తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది
- ఒట్టేసి చెబుతున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీదేనని వ్యాఖ్య
- బీజేపీ స్టేట్ ఆఫీస్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు పట్టిన శని అని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి విమర్శించారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ.. ఇయ్యాల రూ.10 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని అన్నారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనా విధానాలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ రెండూ అవినీతి, కుటుంబ పార్టీలని, ప్రజలను మోసం చేశాయని అన్నారు. సోమవారం హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ అవతరణ దినోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని కిషన్ రెడ్డి ఎగురవేశారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమం ప్రపంచ చరిత్రలో శాంతియుతంగా సాగిన ప్రబలమైన పోరాటమని అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1200 మందికి పైగా ప్రాణత్యాగాలు చేశారని, ఓయూ నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు ఆందోళనలు కొనసాగాయని గుర్తు చేశారు. అన్ని పార్టీలకన్నా ముందుగా బీజేపీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నదని, జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీనేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏండ్ల తర్వాత ప్రజలు, మేధావులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వాన్ని ప్రైవేట్లిమిటెడ్ కంపెనీగా నడిపారు
పదేండ్లలో కేసీఆర్ హామీ ఇచ్చిన బంగారు తెలంగాణ సాధించలేదని, ఆయన కుటుంబం మాత్రం బంగారమైందని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా కేసీఆర్ నడిపారని ఫైర్ అయ్యారు. గతంలో సోనియాగాంధీని “తెలంగాణ పాలిట దెయ్యం” అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం పదవి రాగానే ఆమెను దేవతగా పొగడటం ఆయన ద్వంద్వ వైఖరిని చూపిస్తున్నదని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పునర్నిర్మించాలంటే బీజేపీనే ప్రత్యామ్నాయమని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నీతి, నిజాయితీతో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ‘‘ఒట్టేసి చెప్తున్నా.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీదే’ అని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన, బీఆర్ఎస్, కాంగ్రెస్ దోపిడీ పాలనకు తెరదించాలని, తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ తివారి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.