. 4 minutes
Top Headlines 9 Am 3rd June 2025

నేడు తెనాలికి వైఎస్‌ జగన్‌.. మాజీ సీఎం పర్యటనపై విమర్శలు..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు.. ఇటీవల పోలీసుల చేతిలో లాఠీదెబ్బలు తిన్న జాన్‌ విక్టర్‌ను పరామర్శించనున్నారు.. అయితే, వైఎస్‌ జగన్‌.. తెనాలి పర్యటన పాలక-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి ఉదయం 11.15 గంటలకు తెనాలి ఐతానగర్ చేరుకోనున్నారు వైఎస్‌ జగన్.. అనంతరం ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్, అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు వైఎస్‌ జగన్..

మెగా డీఎస్సీకి లైన్‌ క్లియర్‌
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. మెగా డీఎస్సీ పరీక్షల నిలుపుదలకు ‘నో’ చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. మెగా డీఎస్సీ నిర్వహించకుండా ‘స్టే’ కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు.. అయితే, హాల్‌ టికెట్లు జారీచేశారు.. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారని వాదనలు వినిపించారు ప్రభుత్వ న్యాయవాది.. దీంతో, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు.. కానీ, ఏపీ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ ఆధారంగా ఈ నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలను నిలుపుదల(స్టే) చేయడానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ జరపిని ఏపీ హైకోర్టు.. మెగా డీఎస్సీ నిలుపుదలకు నో చెప్పింది.. కాగా, ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలకు గతంలో సుప్రీంకోర్టు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టు, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ, టెట్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. కొంతమంది అభ్యర్థులు డీఎస్సీ షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని సూచించగా.. ఇప్పుడు హైకోర్టు కూడా స్టే ఇవ్వడానికి నో చెబుతూ.. ఆ అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది..

నేటి నుంచి ఈ నెల 20 వ‌ర‌కు అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చింది. భూ సమస్యలు లేని తెలంగాణ కోస ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుల భూ సమస్యలు తీర్చాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి ఆర్వోఆర్​ యాక్ట్​ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 02 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. నేటి నుంచి(జూన్ 03) ఈ నెల 20 వ‌ర‌కు అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. మాన‌వీయ కోణంలో భూస‌మ‌స్యల‌ను ప‌రిష్కరించాలని కోరింది. ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో అన్నీ రెవెన్యూ గ్రామాలకు తహశీల్దార్ తో కూడిన బృందం వెళ్లనుంది. ఆయా గ్రామాల్లో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కారించనున్నారు. మండలాల వారిగా రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ని ప్రకటించి ఏ రోజున ఏ గ్రామంలో సదస్సు జరుగుతుందనేది ప్రజలకు తెలిసేలా ప్రచారం చేస్తున్నారు.

టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదు
టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్ దేశాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.2గా నమోదైంది. టర్కీ, ఈజిప్ట్, సిరియా అంతటా ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రీస్‌లోని 16 మైళ్ల దూరంలో 6.2 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. డోడెకనీస్ దీవులను భూకంపం తాకినట్లుగా తెలుస్తోంది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం 68 కిలోమీటర్ల (42 మైళ్లు) లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా అంచనా వేశారు. యూఏఈ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:17 గంటలకు నైరుతి టర్కీలో 6.2 తీవ్రతతో భూకంపం నమోదైందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.

పాక్ జైలు నుంచి తప్పించుకున్న 200 మంది ఖైదీలు.. కరాచీలో ఉద్రిక్తత..
పాకిస్తాన్‌కి భారీ దెబ్బ తగిలింది. కరుడుగట్టిన నేరస్తులు ఉండే కరాచీలోని మాలిర్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. మాలిర్ జైలు లోపల హింసాత్మక దాడి జరిగిన తర్వాత సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. ఖైదీలు పోలీస్ అధికారులతో ఘర్షణ పడిన తర్వాత తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో, కరాచీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఖైదీలు జైలు ప్రవేశద్వారాన్ని బద్దలుకొట్టి పెద్ద సంఖ్యలో పారిపోయారు. జైలులో పెద్ద ఎత్తున కాల్పులు జరిగినట్లు రిపోర్టులు వస్తున్నాయి. సాధారణ ప్రజలు జైలు పరిసరాల నుంచి వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దాదాపుగా 200 మంది వరకు ఖైదీలు తప్పించుకున్నట్లు సమాచారం. అయితే, వీరిలో 20 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఖైదీల దాడిలో గాయపడిన ఒక పోలీస్ పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. భద్రతా కారణాల దృష్ట్యా జైలుకు ఆనుకుని ఉన్న జాతీయ రహదారిని రెండు వైపులా తాత్కాలికంగా మూసివేయారు. జైలు డిఐజి హసన్ సెహ్టో తరువాత మీడియాతో మాట్లాడుతూ, జైలు మొత్తాన్ని సీల్ చేశామని, కొంతమంది ఖైదీలు, పోలీసులు గాయపడినట్లు తెలిపారు. మరోవైపు, పరిస్థితిని చక్కదిద్దేందుకు పాక్ రేంజర్లు, పోలీసులు, ఎఫ్‌సి సిబ్బంది ప్రయత్నిస్తోంది.

హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో ట్విస్ట్! అధికారులు ఏం తేల్చారంటే..!
మేఘాలయలో తప్పిపోయిన హనీమూన్ జంట కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. వారం క్రితం తప్పిపోయిన జంట ఆచూకీలో ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేహంపై ఉన్న గాయాలను చూసి ఇది హత్యకు అధికారులు భావిస్తున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టానికి తరలించారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీకి మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. మే 23 నుంచి జంట ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో కనిపించకుండా పోయారు. సమాచారం అందిన దగ్గర నుంచి మేఘాలయ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది జంట కోసం వెతికారు. ప్రతికూల వాతావరణంలో కూడా అధికారులు అన్వేషణ సాగించారు. ఎట్టకేలకు రియాట్ అర్లియాంగ్ దగ్గర లోతైన లోయలో రాజా రఘవంశీ మృతదేహాన్ని డ్రోన్ ద్వారా గుర్తించారు. కానీ భార్య సోనమ్ ఆచూకీ లభించలేదు. దీంతో సోనమ్ ఆచూకీ కోసం కూడా గాలింపు కొనసాగిస్తున్నారు.

ఓలా, ఏథర్, సుజుకి, యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..
భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం నిరంతరం పెరుగుతోంది. వాహనదారులు ఈవీల కొనుగోలుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టూవీలర్ తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రాబోయే కొన్ని నెలల్లో ఓలా, ఏథర్, సుజుకి, యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి రిలీజ్ కానున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభించనున్నాయి. ఏయే కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎప్పుడు రిలీజ్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సుజుకి ఇ యాక్సెస్‌ను జూన్ 2025లోనే విడుదల చేయనుంది. ఈ స్కూటర్‌ను కంపెనీ జూన్ 11, 2025న విడుదల చేయనున్నారు. ఇందులో కొన్ని సూపర్ ఫీచర్లు ఉంటాయి. ఈ స్కూటర్‌ను జనవరి 2025లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టారు. సుజుకి ఇ యాక్సెస్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.30 లక్షల మధ్య ఉండవచ్చు.

వారి కోసమైనా ఐపీఎల్ టైటిల్ సాధిస్తాం.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన ఐపీఎల్ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు అహ్మదాబాద్‌లో ఐపీఎల్ 18 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మంగళవారం రాత్రి 7.30 మొదలయ్యే టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోవడంతో.. నేడు ఆ కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. బెంగళూరు, పంజాబ్ టీమ్స్ సమవుజ్జీలుగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్స్ రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్ సోమవారం ట్రోఫీతో ఫోటోలకు పోజులు ఇచ్చి.. మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజత్ పటీదార్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ కోసం అయినా టైటిల్ సాధించేందుకు ప్రయత్నిస్తాం అని చెప్పాడు. ‘విరాట్ కోహ్లీ కొన్నేళ్లుగా టీమిండియా, ఆర్సీబీకి ఎంతో సేవ చేశాడు. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో గెలవడం మాకు చాలా ముఖ్యం. కోహ్లీ, ముఖ్యంగా అతడి అభిమానుల కోసం ట్రోఫీ గెలవాలి. ఆర్సీబీ ఫాన్స్ మాకు ఎంతో మద్దుతుగా ఉంటారు. ఫైనల్‌లో వంద శాతం గెలవడానికి ప్రయత్నిస్తాం. ఏ ఒక్క చిన్న అవకాశంను వదలం’ అని పటీదార్ తెలిపాడు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.