
- హనుమకొండ జిల్లా నడికుడ మండలంలో విషాదం
పరకాల, వెలుగు : చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు నీటిలో మునిగిపోవడంతో.. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి సైతం చనిపోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికుడ మండలం రాయపర్తి గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయపర్తి గ్రామంలోని ఊర చెరువులో చేపలు పట్టేందుకు సోమవారం ముదిరాజ్ కులస్తులు వెళ్లారు. చెరువులోకి దిగి చేపలు పడుతున్న క్రమంలో వీర్ల హర్షిత్కుమార్ (14) నీటిలో మునిగిపోయాడు.
గమనించిన కూరాకుల సురేందర్ (45) హర్షిత్ను కాపాడేందుకు ప్రయత్నించగా అతడు సైతం నీటిలో మునిగిపోయాడు. మిగతా వారంతా కలిసి హర్షిత్తో పాటు సురేందర్ను ఒడ్డుకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఇద్దరూ చనిపోయారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల సీహెచ్సీ మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించి, కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.