
Prostarm Info Systems IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలు కొంత ఒడిదొడుల లిస్టింగ్స్ ప్రస్తుతం చూస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న వచ్చిన రెండు కంపెనీల ఐపీవోలు పెట్టుబడిదారులను నిరాశకు గురిచేయగా.. నేడు వచ్చిన ఐపీవో మాత్రం అడుగుపెట్టడంతోనే పెట్టుబడిదారులకు సూపర్ రాబడులను తెచ్చిపెట్టింది. దీంతో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు సంతోషంలో పార్టీ చేసుకుంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి కంపెనీ ఐపీవో గ్రేమార్కెట్లో ఉన్న అంచనాలకు మించి మెరుగైన లిస్టింగ్ నమోదు చేసింది. బీఎస్ఈలో కంపెనీ షేర్లు ఒక్కోటి ఇష్యూ ధర కంటే 19 శాతం ప్రీమియంతో ఒక్కోటి రూ.125 వద్ద ట్రేడింగ్ మెుదలుపెట్టాయి. అలాగే ఎన్ఎస్ఈలో స్టాక్ ఒక్కోటి రూ.120 రేటు వద్ద ప్రయాణాన్ని మెుదలుపెట్టింది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.168 కోట్లను విజయవంతంగా సమీకరించగలిగింది.
కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.95 నుంచి రూ.105గా ప్రకటించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 142 షేర్లుగా నిర్ణయించటంతో ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవోలో పాల్గొనటానికి కనీసం రూ.13వేల 490 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. తాజా ఇష్యూ సమయంలో కంపెనీ ఐపీవో మెుత్తం 97 సార్లు సబ్స్క్రైబ్ చేయబడింది. రిటైల్ పెట్టుబడిదారుల విభాగం 39.5 రెట్లు, సంస్థాగత ఇన్వెస్టర్ల పోర్షన్ 104 సార్లు, నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 222 రెట్లు బెట్టింగ్ వేశారు.
కంపెనీ వ్యాపారం..
ముంబై కేంద్రంగా పనిచేస్తున్నఈ కంపెనీ పవర్ సొల్యూషన్స్ ఉత్పత్తులను డిజైన్, తయారీ వ్యాపారంలో ఉంది. కంపెనీ యూపీఎస్ సిస్టమ్స్, ఇన్వర్టర్ సిస్టమ్స్, సోలార్ హైబ్రిడ్ ఇన్వర్టర్ సిస్టమ్స్, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్, వోల్టేజ్ స్టెబిలైజర్లు వంటి ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తోంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.