ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలోని అసోం ప్రభుత్వం సరియైన పత్రాలు లేని విదేశీయులను బంగ్లాదేశీయులకు వెనక్కి పంపించే ప్రయత్నాలను ఇటీవల వేగవంతం చేసింది. విదేశీయులుగా ప్రకటించిన వారిని వెనక్కి పంపించేయాలని 2025 ఫిబ్రవరి 4న సుప్రీం కోర్టు సైతం సమర్థించిన ఈ విధానం బంగ్లాదేశ్ ప్రభుత్వంతో అధికారిక సమన్వయంతో అమలు చేయకపోవడం వల్ల తీవ్ర వివాదానికి దారితీస్తోంది. అంతేకాకుండా అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉండకపోవడం వెనక్కి తిప్పి పంపించడానికి అసోం కేంద్రంగా ఎంచుకోవడం మానవత్వానికి సంబంధించి విస్తృతమైన పరిణామాలు ఈ ప్రాంతంలో ఉనికికి సంబంధించిన విధానాలపై ప్రశ్నలను కూడా లేవనెత్తుతున్నది. విదేశీ పౌరులు ముఖ్యంగా సరియైన పత్రాలులేని వలసదారులను తిప్పి పంపించడానికి అంతర్జాతీయ నిబంధనలు, సంప్రదాయాలు ఉన్నాయి.
మానవ హక్కులు, గౌరవం, ద్వైపాక్షిక సహకారాలకు ఇవి ప్రాధాన్యత ఇస్తున్నాయి. 1951 నాటి శరణార్థుల ఒప్పందం, అలాగే 1967 నాటి దాని ప్రోటోకాల్ భారత్కు వర్తించవు. ఎందుకంటే వాటిపై అది సంతకం చేయలేదు. వేధింపులు, చిత్రహింసలు లేదా ప్రాణహాని ప్రమాదాలు ఎదుర్కొనే దేశాలకు శరణార్థులను తిప్పి పంపరాదని ఈ ఒప్పందంలో ఉద్దేశిస్తున్నాయి. అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల డిక్లరేషన్ (1948), పౌర రాజకీయ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒడంబడిక( International treaty) (1966) కూడా జీవించే హక్కు, స్వేచ్ఛ, ఏకపక్ష నిర్బంధంనుంచి రక్షణను నొక్కి చెబుతున్నాయి. సరియైన పత్రాలు లేని వారికి కూడా ఇవి వర్తిస్తాయి.చట్టబద్ధమైన తరలింపునకు కొన్ని అంతర్జాతీయ నిబంధనలు ఉన్నాయి.
అవేమిటంటే ఏ వ్యక్తినైతే వెనక్కి పంపిస్తున్నారో అతని జాతీయతను సంబంధిత దేశంతో దౌత్యమార్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలి. అలాగే తమను విదేశీయులుగా ప్రకటించడంపై అప్పీలు చేసుకునే హక్కుతోపాటుగా న్యాయపరమైన చర్యలకు వలసదారులకు అవకాశం ఉండాలి. చివరగా వలసదారుల తరలింపు అనేది వారిని స్వీకరించే దేశంతో సమన్వయంతో పాటుగా వారి రక్షణ, గౌరవప్రదమైన తరలింపును కలిగి ఉండాలి. అలాగే వలసదారులను జనసంచారం లేని ప్రాంతాలు లేదా ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో వదిలేయడం లాంటివి లేకుండా తరలింపు ఉండాలి. అయితే భారత దేశం అనుసరిస్తున్న వలసదారులను వెనక్కి పంపించే విధానం ఈ నిబంధనలకు భిన్నంగా ఉంది.
వలసదారుల తరలింపునకు సంబంధించి అధికార ఒప్పందాలు లేకుండా భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు గుండా జనాన్ని బలవంతంగా తరలించడం ద్వారా భారత్ ప్రాణహాని ఉన్న దేశానికి వ్యక్తిని తిప్పి పంపకూడదన్న సూత్రాన్ని ఉల్లంఘించడమే కాకుండా మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఈ విధానంపై 2025 మే 8న ఆందోళన వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తరలింపునకు సంబంధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పారదర్శకత, సమన్వయం లేకపోవడంతోపాటు వెనక్కి తిప్పి పంపేవారిని కళ్లకు గంతలు కట్టడం, చేతులకు బేడీలు వేయడం వంటివి చేస్తున్నారన్న వార్తలు మానవ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని విమర్శలకు కారణమవుతున్నాయి. జనసంచారం లేని ప్రాంతంలోకి వ్యక్తులను బలవంతంగా తరలించడం మానవ హక్కులకు వ్యతిరేకమని ఎందుకంటే అవి వారి ప్రాణాలకు ముప్పు కావడమే కాకుండా దౌత్యపరమైన ఒడంబడికలకు వ్యతిరేకమని అసోం విదేశీ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు శిశిల్డే అంటున్నారు.
ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్ లాంటి రాష్ట్రాల నుంచి సరియైన పత్రాలులేని వలసదారులను బంగ్లాదేశ్తో విశాలమైన సరిహద్దు కలిగి ఉన్న పశ్చిమ బెంగాల్ ద్వారా కాకుండా అసోం, త్రిపుర మార్గాల ద్వారా వెనక్కి పంపించాలన్న నిర్ణయం గందరగోళానికి దారి తీయడమేకాకుండా రాజకీయ రవాణాపరమైన ఆలోచనతో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. ఎందుకంటే 1970 దశకం నుంచి కూడా దేశం లో జరిగిన విదేశీ వ్యతిరేక ఉద్యమానికి అసోం కేంద్రంగా ఉంది. పౌర సత్వానికి కటాఫ్ తేదీగా 1971 మార్చి 25ను నిర్ణయించడమే బంగ్లాదేశ్ నుంచి వలసల విషయంలో ఈ రాష్ట్రం చారిత్రకంగా ఎంత సున్నితంగా ఉందో అర్థమవుతోంది. ఇక రవాణా పరంగా చూస్తే సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్)తో సమన్వయం లాంటి వాటితో పాటుగా అసోం, త్రిపుర సరిహద్దులు వలసదారులను తిప్పి పంపే ఆపరేషన్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా అసోం, త్రిపురలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాలు కూడా అక్రమ వలసదారులను వేగంగా గుర్తించి వెనక్కి పంపించడానికి ప్రాధాన్యత ఇస్తున్నది. దీనికి భిన్నంగా తృణమూల్ కాంగ్రెస్ పాలనలోని పశ్చిమ బెంగాల్ వలసల విషయంలో మరింత సంక్లిష్టమైన రాజకీయ వైఖరిని అవలంబిస్తోంది.
బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందని వారితో పాటుగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న బెంగాలీ మాట్లాడే వారిని బెంగాలీ వ్యతిరేకులుగా ముద్ర వేయడాన్ని, బలవంతంగా వారిని వెనక్కి పంపించే విధానాలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదటి నుంచి వ్యతిరేకమనే విషయం తెలిసిందే. ఈ రాజకీయ భిన్నవైఖరి కారణంగానే పశ్చిమ బెంగాల్ కాకుండా అసోం, త్రిపురలను వలసదారులను వెనక్కి పంపించడానికి ఎంచుకోవడానికి కారణమైందని అర్థమవుతోంది. అయితే ఈ వైఖరి రవాణా పరమైన, నైతికపరమైన సమస్యలను లేవనెత్తుతోంది. 2025 మే 25న ఘజియాబాద్ నుంచి అగర్తలకు సైనిక విమానం ద్వారా 160 మంది వలసదారులను తరలించడం లాంటి ఘటనలు ఆందోళన, అస్పష్టతలను కలిగిస్తున్నాయి. నిర్బంధంలో ఉన్న వారెక్కడున్నారనే దానిపై తనకేమీ తెలియడం లేదని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం మానవ హక్కులపరమైన సమస్యలకు అద్దం పడుతున్నాయి.
వలసదారులను కళ్లకు గంతలు కట్టి, చేతులకు బేడీలు వేసి జనసంచారంలేని ప్రాంతంలో లేదా సుందర్బ న్స్ లాంటి ప్రమాదకరమైన ప్రాంతాల్లో వదిలేస్తున్నట్టు వస్తున్న వార్తలు ఈ ప్రక్రియ ఎంత అమానుషంగా జరుగుతోందో ఎత్తిచూపుతోంది. మయన్మార్నుంచి నిర్దాక్షిణ్యంగా తరిమివేయబడ్డ రోహింగ్యాలు కూడా వీరిలో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే వారు స్వదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత తీవ్రమైన వేధింపులు, చిత్రహింసలకు గురయ్యే ప్రమాదం ఉంది. 40 మంది రోహింగ్యాలను అండమాన్ నికోబార్ దీవులకు విమానంలో తీసుకు వచ్చి మయన్మార్ సమీపంలోని సముద్రం వద్ద వదిలేశారని, ట్రంప్ తరహా క్రూరత్వ విధానంతో పోలుస్తూ తీవ్ర వార్త ఆరోపించింది. విచక్షణారహితంగా అమలు చేసే విధానంలో భారతీయ పౌరులను కూడా విదేశీయులుగా తప్పుగా గుర్తించే ప్రమాదం కూడా ఉంది. అసోంలో ‘మియా’గా ముద్రపడిన బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు లాంటి సరైన పత్రాలు కలిగి ఉన్నప్పటికీ వేధింపులకు గురి అవుతున్నారు.
ఈ ప్రక్రియ దేశచట్టాలను బేఖాతరు చేయడం. అట్టడుగు వర్గాల కష్టాలను మరింత ఎక్కువ చేసేదిగా ఉంది. అసోం వలసల విషయంలో బిజెపి వైఖరి దాని హిందూ జాతీయతా విధానానికి అద్దం పడుతున్నది. ముస్లింలు ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన వారిని ‘చొరబాటుదారులు’ గా దేశ భద్రత, హిందూ ఉనికికి ముప్పుగా అది అభివర్ణిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కింద హిందువుల పట్ల ఉదారత చూపడం, మరోవైపు ముస్లిం వలసదారులను మనుషుల కన్నా తక్కువగా చూడడం, వారిని ‘చెదపురుగులు’గా అభివర్ణిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2018లో చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనం. 2014కు ముందు రాష్ట్రంలో ప్రవేశించిన హిందూ బంగ్లాదేశీయులపై ఎలాంటి చర్యా ఉండబోదంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ చేసిన ప్రకటన సైతం ఈ మతపరమైన వివక్షను నెత్తికెత్తుతోంది. ఇది మతంతో సంబంధం లేకుండా అన్ని వలసలను వ్యతిరేకించే అసోం జాతీయ వాదుల వైఖరికి భిన్నవైనవి.
ఈ మతతత్వ ముద్ర ఎన్నికల ప్రయోజనాలకు పనికి వస్తుంది. 2016లో అసోం అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ముస్లిం ‘చొరబాట్ల’ భయాన్ని జనంలో కలిగించడం ద్వారా పరిపాలన సవాళ్ల నుంచి వారి దృష్టిని మళ్లించాలని బిజెపి అనుకుంటోంది. అయితే దీని వల్ల స్థానిక అసోమీ ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ విధానం భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను మరింత దెబ్బ తీసే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దులకు ఆనుకొని వున్న ప్రాంతాలు ముఖ్యంగా ధుబ్రి, నాగావ్, మోరీగావ్, బార్పేట, సల్మారా మంతకార్, గోల్ఫారా జిల్లాలోని స్థానికంగా నివాసమున్న భారతీయ పౌరులకు ఆయుధాల లైసెన్స్ మంజూరు చేయాలని గత మే 28న అసోం మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం తీవ్రమైన చర్చను రగిలించింది. ఈ విధానం బెంగాలీ మాట్లాడే ముస్లింలు, చాలా వరకు బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందినవారే మెజారిటీగా వున్న ప్రాంతాలు స్థానిక అసోమీ ప్రజలు మైనారిటీగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేస్తోంది.
ముఖ్యంగా బంగ్లాదేశ్లో అశాంతి వలసదారులను వెనక్కి పంపించేందుకు అసోం చేపట్టిన ప్రయత్నాల కారణంగా ఈ వర్గాలు అభద్రతా భావాన్ని ఎదుర్కొంటున్నాయని బిశ్వ శర్మ భావిస్తున్నారు. 1959 నాటి ఆయుధాల చట్టం, 2016 ఆయుధాల నిబంధనలు ఈ విధానానికి మూలం. ఈ విధానం పౌరులను సాయుధులుగా మార్చడానికి సంబంధించినది కాదని 1979 1985 మధ్య జరిగిన ఒకప్పటి అసోం ఆందోళన నాటి డిమాండ్ను నెరవేర్చడమని శర్మ వాదిస్తున్నారు. అయితే పౌరులకు ఆయుధాలను అందించడంపై దృష్టి పెట్టే ఈ విధానం శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సామర్థంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. పౌరులకు రక్షణ కల్పించడంలో బిఎస్ఎఫ్ అసోం పోలీసుల వైఫల్యానికి ఇది సంకేతమని అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపి సుష్మతా దేవ్ లాంటి విమర్శకులు అంటున్నారు.
ఈ నిర్ణయం ‘గన్ కల్చర్’ను ప్రోత్సహిస్తుందని, స్థానికుల ఘర్షణలను నివారించడం బదులు వాటికి మరింత ఆజ్యం పోసే ప్రమాదం ఉందని వారంటున్నారు. ‘అరాచకం దిశగా ప్రమాదకరమైన అడుగు’ గా ప్రతిపక్ష నాయకుడు గౌరవ్ గొగోయ్ అభివర్ణించారు. అంతేగాక బూటకపు ఎన్కౌంటర్లు లాంటివి చోటుచేసుకునే ప్రమాదం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ విధానాన్ని తీసుకు రావడం వెనుక ఎన్నికల ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం అవుతుంది. ప్రభుత్వ సవాళ్ల నుంచి ఓటర్ల దృష్టిని మళ్లించడంతోపాటు తన హిందూత్వ ఓటర్ల బేస్ను బలోపేతం చేసుకోవడం కోసం బిజెపి వలస వ్యతిరేక సెంటిమెంట్ను రగిలిస్తోందని అర్థమవుతుంది.
- గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
- (రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయాల అంశాల విశ్లేషకుడు)