అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) లో అభ్యసించిన భారత సంతతి విద్యార్థిని మేఘా వేమూరి (Megha Vemuri) గత నెల 29 నాడు ‘గ్రాడ్యూయేషన్ డే’ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధానంగా పాలస్తీనా పై ఇజ్రాయెల్ యుద్ధ చర్యలను ‘నరమేధం’గా పేర్కొనడం తద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఈ రకంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణ కాండను విమర్శిస్తూ ప్రసంగిస్తూ పాలస్తీనాకు అండగా నిలిచిన మేఘా వేమూరిని అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) గ్రాడ్యుయేషన్ వేడుకల నుండి బహిష్కరించినట్లు ఆ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మెలిసా నోబెల్స్ ప్రకటించి ఆమెతోపాటు ఆమె తల్లిదండ్రులను సైతం క్యాంపస్ నుండి బయటకు పంపించడంఅప్రజాస్వామికం. నిజానికి అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా వెలుగొందుతున్న అమెరికాలో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం ‘అప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలిచింది’ అని చెప్పవచ్చు.
నిజానికి ‘ప్రజాస్వామిక దేశం అని గొప్పగా చెప్పుకునే అమెరికా దేశం చరిత్ర మొత్తం అప్రజాస్వామికమయం’ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గాజాలో ఒక పక్క ఇజ్రాయెల్ భీకర యుద్ధాన్ని కొనసాగిస్తున్న తరుణంలోను, అదే సమయంలో మరో పక్క విశ్వవిద్యాలయాల సంబంధాల గురించి అమెరికాలోని కళాశాల క్యాంపస్లలో నిరసనలు పెల్లుబుకుతున్న తరుణంలోను మసాచుసెట్స్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) వేదిక నుండి భారతీయ – అమెరికన్ విద్యార్థిని మేఘా వేమూరి చేసిన ఇజ్రాయెల్ – పాలస్తీనా సంఘర్షణపై బలమైన రాజకీయ విమర్శనాత్మకమైన వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఈ తరుణంలో మేఘా వేమూరి చూపిన ధైర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకం ప్రశంసిస్తూనే ఉన్నారు.
మేఘా వేమూరి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. అయితే ఆమె జార్జియా (అమెరికా) లోని ఆల్ఫారెట్టాలో పుట్టి పెరిగారు. ఆమె 2021 లో ఆల్ఫారెట్ట హైస్కూల్ నుండి పట్టభద్రురాలయ్యారు. అదే సంవత్సరం ఆమె మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో(Institute of Technology) చేరి కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్, భాషాశాస్త్రంలో ట్రిపుల్ మేజర్తో తన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశారు. గ్రాడ్యుయేటింగ్ క్లాస్ అధ్యక్షురాలిగాను ఆమె కొనసాగుతున్నారు. మెక్గోవర్న్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్లో రీసెర్చ్ అసిస్టెంట్గాను ఆమె వ్యవహరించారు. మేఘా వేమూరి 2021 లో నేషనల్ మెరిట్ స్కాలర్ అవార్డు పొందారు. తన విద్యా విజయాలకు మించి విప్లవాత్మక ఆలోచనలకు వేదికను అందించాలనే లక్ష్యంతో ఉన్న ఆమె ఎంఐటి విద్యార్థి బృందం అయిన రిటర్న్ రెవల్యూషన్ లోను సభ్యురాలుగా ఉన్నారు. ఇటీవలి కాలంలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు తీవ్రతరం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మేఘా వేమూరి ‘స్వేచ్ఛా పాలస్తీనా’ కోసం గళమెత్తారు.
పాలస్తీనా సంఘీభావానికి ప్రతీకగా మేఘా వేమూరి ఎరుపు కెఫెయే (హిజాబ్ వంటిది) ధరించి గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్నారు. ఆమె ప్రసంగ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఈ రకంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మేఘా వేమూరి చేసిన విమర్శలను కొందరు వ్యతిరేకించారు. అయితే మసాచుసెట్స్ ఇన్స్స్ట్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేషన్ వేడుకను రాజకీయ మైదానంగా ఆమె ఉపయోగించారని మరికొందరు అభ్యంతరాలు వ్యక్తీకరించారు. మేఘా వేమూరి తన ప్రసంగంలో పాలస్తీనియన్లకు బలంగా సంఘీభావాన్ని ప్రకటించారు. ‘పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడికి అమెరికా మాత్రమే కారణం కాదు. మన యూనివర్శిటీ కూడా సహాయం చేస్తూ ప్రోత్సహిస్తూనే ఉంది.
కాని ఇది సరైన విధానం ఏమాత్రం కాదు’ అని మేఘా వేమూరి తీవ్రంగా విమర్శించారు. ఇజ్రాయెల్ తో తమ వర్శిటీ చేసుకున్న ఒప్పందాలను ఆమె అంతే తీవ్రంగా వ్యతిరేకించారు. ఇజ్రాయెల్ పాలస్తీనాను భూమినుండి పూర్తిగా తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాలలో ఎంఐటి భాగం కావడం సిగ్గుచేటు. అలాగే ఇజ్రాయెల్ సైనిక సంస్థలతో రీసెర్చ్ సంబంధాలను కొనసాగిస్తుంది. ఇది గాజాలో జరుగుతున్న హింసకు సహాయం చేస్తుందని ఆమె ఘాటుగా విమర్శించారు. మసాచుసెట్స్ వర్సిటీ విద్యార్థులు అటువంటి హింసాకాండను ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదు. జాతి విధ్వంసాన్ని అసలే హర్షించరు. అలాంటి జాతి విధ్వంసక ఇజ్రాయెల్ సైన్యంతో సంబంధాలను తెంచుకోవాలి అని ఆమె సృష్టంగా పేర్కొనడం గమనార్హం.
గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు మసాచుసెట్స్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు పిలుపు ఇవ్వడం శుభపరిణామం. ఈ క్రమంలోనే విద్యార్థులు శాంతికోసం ముందుకు సాగడం గమనార్హం. ఎంఐటి యాజమాన్యం ప్రో -పాలస్తీనా ఉద్యమకారులను బెదిరింపులు, భయపెట్టడం, అణచివేతల ద్వారా అడ్డుకుంటూనే ఉంది. అయిననూ వారు వెనకడుగు వేయడం లేదు. ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనా ఒక రకంగా నాశనం అయిపోయింది. అక్కడి ప్రజలు బాంబు దాడులతో, ఆకలి కొరతతో చనిపోతూ ఉన్నారు. మేము గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జీవితాలను మరింతగా ముందుకు కొనసాగిస్తున్నాము. మా జీవితాలను శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లు గాను, విద్యావేత్తలు గాను, నాయకులు గాను తీర్చిదిద్దుకుటున్నాం. కాని గాజాలో ఇప్పుడు ఒక్క విశ్వవిద్యాలయం కూడా మిగలలేదు. అందువలన పూర్వ విద్యార్థులుగా ఇజ్రాయిల్తో సంబంధాలను తెంచుకోవాలి అని వర్శిటీని డిమాండ్ చేస్తూనే ఉంటాం’ అని మేఘా వేమూరి పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయ అధికారుల నుండి బెదిరింపులు, అణచివేతలను ఎదుర్కొంటున్నప్పటికీ ‘విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా నిలబడడం నూతన సమాజ నిర్మాణానికి బాటలు వేయనుంది’ అని నిర్దిష్టంగా చెప్పవచ్చు. అమెరికాలోని చాలా మంది విద్యార్థుల హృదయాలలో భయాందోళనలు గూడుకట్టుకుని ఉండేవి. మీరు ఇంతకు ముందు భయం అనే అడ్డంకిని ఎదుర్కొన్నారు. సరైనదాని కోసం నిలబడటానికి మీరు దానిని ఇంధనంగా మార్చారు. ఒక జాతి విధ్వంసాన్ని ప్రజలు ఏమాత్రం సహించలేరు. ఎంఐటి స్వేచ్ఛా పాలస్తీనాను కోరుకుంటుందని మీరు ప్రపంచానికి చూపించారు’ అని మేఘా వేమూరి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం నిజంగా అద్భుతం. అంతిమంగా మేఘా వేమూరి అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ‘స్వేచ్ఛా పాలస్తీనా కోసం చేసిన ప్రసంగం ప్రపంచ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది’ అని సగర్వంగా చెప్పవచ్చు.
- జెజెసిపి
బాబూరావు
94933 19690