విజయనగరం జిల్లాలోని రామతీర్ధం సీతారాముల ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆలయాన్ని ఏటా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. రామతీర్ధం ఆలయాన్ని సందర్శించేవారు దీనికి పక్కనే ఉన్న బోదికొండను కూడా సందర్శించవచ్చు. 16వ శతాబ్దంలో విజయనగర మహారాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. దేవాలయ నిర్మాణం కూడా ఈ కాలంలో జరిగిందని చెబుతారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, శనివారాలలో అనేక మంది భక్తులు సందర్శిస్తారు.
రామతీర్ధం పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న బోదికొండ, దాని అద్భుతమైన లక్షణాలు, చరిత్రతో ప్రత్యేకమైనది. ఈ కొండ, పురాణాలలోని పాత్రలతో, చారిత్రక సంఘటనలతో అనుసంధానమై, అనేక రహస్యాలను దాచుకుంది. బోదికొండకి చారిత్రక, పురాణ ప్రాముఖ్యత ఉంది.
బోదికొండ, ఒక ఏకశిల. అంటే ఇది ఒకే రాతిపై ఏర్పడిన కొండ. ఈ కొండపై రాములవారి దేవాలయం నిర్మించబడింది. స్థలపురాణం ప్రకారం, పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఈ కొండపై నివసించారు. శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన దేవతామూర్తులు, ఇప్పటికీ ఈ దేవాలయంలో పూజలందుకుంటున్నాయి. ఈ కొండపై ఉన్న ఒక కొలను, దాని విశేషమైన లక్షణాలకు ప్రత్యేకమైనది. ఇక్కడ వేసిన నాణేలు లేదా వస్తువులు కాశీలో తేలుతాయని ఒక నమ్మకం ఉంది. ఈ కొలనులో నీరు ఎప్పుడూ ఎండిపోదు.
భీముడి గృహం అని పిలువబడే ప్రదేశం కూడా బోదికొండపై ఉంది. ఇక్కడ భీముడు తన బలంతో పడిపోతున్న పర్వతాన్ని తన తలతో ఆపినట్లుగా చెబుతారు. ఈ ప్రదేశం నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంది. ఇరుకైన మార్గాలు, అడ్డంగా తిరగాల్సిన ప్రదేశాలు ఉన్నాయి.
సీతమ్మవారి వనవాసానికి సంబంధించిన కథనాలు కూడా ఈ కొండతో అనుసంధానమై ఉన్నాయి. సీతమ్మవారు లవకుశులను ఇక్కడ ఆడించినట్లుగా చెబుతారు. కొండ కింద, సీతమ్మవారి పురుటి మంచానికి సంబంధించినట్లు చెప్పబడే ప్రదేశం ఉంది. రాళ్ళ నుండి ఇంగువ వాసన వస్తుందని కూడా చెబుతారు.
ఇవి మాత్రమే కాదు.. ఈ కొండపై జైన, బౌద్ధ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీనిపై మీరు బౌద్ధారామం, అలాగే శిధిల జైన్ టెంపుల్ కూడా ఇక్కడ చూడవచ్చు. రామతీర్ధం ఆలయాన్ని సందర్శించేవారు, ఈ చారిత్రక పురాణ ప్రాముఖ్యత కలిగిన బోదికొండను కూడా సందర్శించండి.