
గత సీజన్లలో వెంటాడిన సమస్యలను అధిగమించిన ఆర్సీబీ ఈసారి అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. ఆరంభం నుంచి చివరి వరకూ అద్భుతంగా ఆడిన బెంగళూరు క్వాలిఫయర్– 1లో పంజాబ్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు వచ్చింది. నాలుగు రోజుల విరామం తర్వాత ప్రశాంతంగా ఆఖరాటకు సిద్ధమైంది. ప్రతీ సీజన్లానే కింగ్ కోహ్లీ (614 రన్స్) టాపార్డర్లో పరుగుల వరద పారించాడు. ఈసారి విరాట్తో పాటు మరికొందరు కూడా సమష్టిగా రాణించడం ఆ జట్టుకు కలిసొచ్చింది. ఫిల్ సాల్ట్ ఇండియా సూపర్ స్టార్కు సరైన ఓపెనింగ్ పార్ట్నర్గా నిలిచాడు. ఈ ఇద్దరూ ఇచ్చే ఆరంభం ఫైనల్లో కీలకం కానుంది. మయాంక్ అగర్వాల్, కెప్టెన్ రజత్ పటీదార్, జితేష్ శర్మ కూడా సత్తా చాటుతున్నారు.
గత రెండు మ్యాచ్లకు దూరమైన హిట్టర్ టిమ్ డేవిడ్ ఈ మ్యాచ్కు ఫిట్గా ఉంటే జట్టు బలం మరింత పెరుగుతుంది.18వ సీజన్లో ఆర్సీబీ సక్సెస్కు మరో ప్రధాన కారణం ఆ టీమ్ సూపర్ బౌలింగ్. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్వుడ్ (21 వికెట్లు) ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆఖరాటలో మరిన్ని వికెట్లు తీసి జట్టు కలను నెరవేర్చాలని అతను పట్టుదలగా ఉన్నాడు. యశ్ దయాల్, భువనేశ్వర్ కూడా నిలకడగా రాణిస్తున్నారు. క్వాలిఫయర్–1లో పంజాబ్ మిడిలార్డర్ను దెబ్బకొట్టిన స్పిన్నర్ సుయాశ్ మరోసారి అదే పెర్ఫామెన్స్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండా ఇన్నేండ్లుగా పెద్దన్నగా తమ జట్టును తీర్చిదిద్దిన విరాట్ కోహ్లీ కెరీర్లో లోటుగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని ఎలాగైనా సాధించాలని ఆర్సీబీ ఆటగాళ్లంతా పట్టుదలగా ఉన్నారు.