
- పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క
ములుగు, వెలుగు : ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగులోని తంగేడు స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కలెక్టర్ దివాకర, ఎస్పీ పి.శబరీష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్బానోతు రవిచందర్, అడిషనల్ కలెక్టర్ సంపత్ రావుతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రగతి నివేదిక వినిపించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పథకంలో భాగంగా ములుగు జడ్పీ కార్యాలయ ఆవరణంలో నమూనా ఇందిరమ్మ ఇల్లును మంత్రి సీతక్క ప్రారంభించారు.
ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రానున్న మేడారం మహాజాతరకు రూ.135 కోట్లతో పనులు చేపడుతున్నామని, ఇప్పటికే రూ.35 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా రూ.6 కోట్లతో పలు జంక్షన్లలో సింబల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ.5 కోట్లతో మేడారంలోని జంపన్న వాగుపై సుందరీకరణ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో రూ.కోటిన్నరతో, ఏటూరు నాగారం మండల కేంద్రంలో రూ.కోటితో కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతన కలెక్టర్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీని మంత్రి ప్రారంభించారు.