
కాస్తంత స్థలం కనిపిస్తే చాలు.. అక్కడ చెట్లు..చేమలు ఉన్నా.. వెంటనే కొట్టేయడం.. అపార్ట్మెంట్లు నిర్మించడం.. ఓ 70 నుంచి 80 లక్షలకు అమ్మడం .. ఇది రియల్టర్ల పరిస్థితి. ఇటీవల కాలంలో చెట్లు, పొదలతో ఉన్న ప్రదేశాలను తుడిచిపెట్టి, ఆ స్థలాలను వెంచర్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మటం జరుగుతుంది. ఈ చెట్లు, పొదలను తుడిచే సందర్భాలలో అనేక దేవతా సర్పములు, వాటి పిల్లలు, గుడ్లు ఇవన్నీ కూడా మరణించటం జరుగుతుంది. నాగుల నివాసాలను మానవులు ఆక్రమించడం వలన చాలా దుష్పరిణామాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
చెట్లు.. పొదలు ఉన్న ప్రదేశాల్లో సాధారణంగా సర్పాలు.. నాగులు ఉంటాయి. సామూహిక సర్పవధ జరగటం వలన ఆ ప్రదేశానికి, యజమానికి, పని వారికి అందరికి సర్పశాపం తగులుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవతా సర్పములను చంపివేసిన చోట, రియల్ ఎస్టేల్ వ్యాపారులు అపార్టుమెంట్లు, భవనాలు, ఇళ్ళు నిర్మించి ఇతరులకు విక్రయిస్తారు. ఇక అలాంటి వాటిలో నివసిస్తున్న వారికి కూడా సర్పశాప ప్రభావం ఖచ్చితంగా ఉంటుందట.
జన్మకుండలిలో సర్పశాపం ఉన్నవారు.. ఇలాంటి ప్రదేశాలలో నివసిస్తే ఇక వాటి ప్రభావాలు వర్ణనాతీతం. అతి భయంకరమైన సర్పశాప ప్రభావాలు ఎదుర్కోవలసి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రదేశాలలో జీవించేవారు దీర్ఘ రోగాలకు గురికావటం, సంతానం చెడుదోవలు పట్టటం, సంతానంప్రమాదాల్లో మరణించడం.. ఆర్థిక నష్టాలు ఎదుర్కోవటం లాంటి అనర్థాలను ఎదుర్కోక తప్పదని పురాణాలు చెబుతున్నాయి. వ్యామోహాలకు లొంగిపోతారు. ప్రేమలో మోసపోతారు.భార్యా,భర్తల మధ్య అనవసరమైన అపోహలు, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి.
అయితే తెలిసో తెలియకో చేసిన తప్పిదములకు సర్పశాపానికి గురి అయినవారు తగిన పరిహారాలను జరిపించుకుంటే సర్పశాపం నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగ దేవతా ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది.