. < 1 minute
Telangana: ఆ వీధిలో అర్ధరాత్రి అదేపనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా

గద్వాల పట్టణంలోని హమాలీ కాలనీ వాసుల‌ను ఓ భారీ మొసలి హ‌డ‌లెత్తించింది. సోమవారం అర్ధరాత్రి ఇళ్ల మధ్యకు వచ్చిన మొస‌లిని చూసి కుక్కలు గట్టిగా మొరగడంతో.. ఏమై ఉంటుందా అని చూసిన స్థానికులు మొసలిని చూసి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అందరూ కలిసి మొసలిని తాడుతో బంధించి, అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది, స్థానిక జంతు సంరక్షణ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చాకచక్యంగా వ్యవహరించి, మొసలికి ఎలాంటి హాని కలగకుండా, ప్రజలకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం ఆ మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. హామాలి కాలనీకి సమీపంలో జూరాల ప్రాజెక్టు కుడి కాలువ ఉందని, అక్కడినుంచే ముసలి వచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో మొసళ్ల సంచారం పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసినప్పుడు, వరదలు సంభవించినప్పుడు అవి తమ సహజ ఆవాసాల నుంచి బయటకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. నదుల్లో నీటి మట్టాలు పెరగడం లేదా ఆహార వనరులు తగ్గడం వంటి కారణాల వల్ల మొసళ్లు తమ ఆవాసాలను వదిలి బయటకు వస్తుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అటవీ శాఖ అధికారులు మొసళ్లు ఎక్కువగా సంచరించే ప్రాంతాలపై నిఘా పెంచారు. వర్షాకాలం కావడంతో నదులు, నీటి వనరుల సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వన్యప్రాణులు కనిపిస్తే ఎలా స్పందించాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దారి తప్పి వచ్చిన మొసళ్లను సురక్షితంగా పట్టుకుని, వాటి సహజ ఆవాసాలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.