. < 1 minute
Viral: ఉదయాన్నే బ్యాంక్ తెరిచేందుకు వచ్చిన ప్యూన్.. ఎదురుగా కనిపించిన సీన్ చూడగా

ఓ కెనరా బ్యాంకు బ్రాంచిలో భారీ చోరీ జరిగింది. సెలవులు కావడంతో సిబ్బంది తాళం వేసి వెళ్లిన బ్యాంకులో భారీ చోరీ జరిగింది. ఏకంగా 59 కిలోల బంగారం చోరీ జరిగినట్టు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కర్నాటక విజయపుర జిల్లాలోని మంలోలిలోని కెనరా బ్యాంకులో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మే 24, 25 తేదీలు వారాంతపు సెలవులు కావడంతో మంగోలి కెనరా బ్యాంకు శాఖను మూసివేశారు. మే 23వ తేదీ సాయంత్రం సిబ్బంది బ్యాంకును భద్రంగా మూసి తాళం వేసి ఇంటికి వెళ్లారు. తిరిగి మే 26వ తేదీన బ్యాంకు తెరిచేందుకు వచ్చిన ప్యూన్, బ్యాంకు షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి షాక్ అయ్యారు. వెంటనే ఆయన బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన బ్యాంకుకు చేరుకున్న అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బ్యాంకు సిబ్బంది లోపలికి వెళ్లి పరిశీలించగా బంగారం చోరీకి గురైనట్లు నిర్ధారించుకున్నారు. విజయపుర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మణ్ బి. నింబర్గి ఈ దోపిడీని ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన తనిఖీ చేసిన తర్వాత, దొంగలు బ్యాంకులోకి చొరబడి దోపిడీకి పాల్పడినట్లు తేలింది. దోచుకున్న సొత్తును బ్యాంకు అధికారులు అంచనా వేయగా 59 కిలోల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారని తెలిపారు. ఈ బంగారం విలువ కోట్ల రూపాయలలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఇటీవల జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీలలో ఒకటిగా పోలీసులు భావిస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం… మే 24, 25 తేదీల మధ్య రాత్రి సమయంలో ఈ దోపిడీ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చోరీకి గురైన బంగారం బ్యాంకు సొంత ఆస్తి కాదని, వినియోగదారులు బంగారు రుణాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆభరణాలని ఎస్పీ నింబర్గి స్పష్టం చేశారు. ఈ ఘటనతో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ భారీ దోపిడీ కేసును ఛేదించేందుకు ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అనుమానితులను విచారించడంతో పాటు బ్యాంకు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ, బ్యాంకు మూసి ఉన్న రోజుల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దోషులను త్వరగా పట్టుకుని, చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో బ్యాంకుల వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.