
మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా నిర్వహించామన్నారు. మిస్ వరల్డ్ పోటీలపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. పోటీదారులు 30 తులాల బంగారం ఇచ్చారనేది పచ్చి అబద్ధం అని చెప్పారు.
తెలంగాణ ఆతిథ్యానికి అతిథులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు.సొంత పత్రికలు మీడియాలో తప్పుడు కథనాలు ఇచ్చారన్నారు. కంటెస్టెంట్ల కాళ్లు కడిగారని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు జూపల్లి. ఐఏస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న ఘనత కేసీఆర్ దేనన్నారు.
గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తే కొందరు పలుచన చేయాలని చూశారన్నారు జూపల్లి . మిస్ వరల్డ్ నిర్వహించేందుకు ఎన్నో దేశాలు,రాష్ట్రాలు పోటీపడ్డాయన్నారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు. టూరిజం ప్రమోషన్ కోసం బీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. విదేశాల టూర్ల కోసమే బీఆర్ఎస్ 119కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. చేనేత కళాకారుల ఉత్పత్తులకు మంచి ప్రమోషన్ వచ్చిందన్నారు జూపల్లి.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ సుందరీ ‘ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ’ నిలిచింది. మే 31 హైదరాబాద్లోని హెటెక్స్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ ఫినాలేలో విజేతగా నిలిచి 72వ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. రన్నర్ గా మిస్ ఇథియోపియా నిలిచింది.