
ఇజ్రాయెల్-గాజా మధ్య గత కొంత కాలంగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. దీంతో పాలస్తీనా మద్దతుదారులు ఆయా దేశాల్లో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం దగ్గర కాల్పులు జరపడంతో ఇద్దరు ఇజ్రాయెల్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆదివారం అమెరికాలోని కొలరాడోలోని బోల్డర్ ప్రాంతంలో ఒక వ్యక్తి సీసా బాంబులు విసిరడంతో పలువురు గాయపడ్డారు. ఇలా యూదులకు వ్యతిరేకంగా పాలస్తీనా సానుభూతిపరులు రెచ్చిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Tuni Train Burning Case: తుని రైలు దగ్ధం కేసుపై సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ఆలోచన లేదు..!
తాజాగా ఈ వాతావరణం భారత్కు కూడా పాకింది. దేశ రాజధాని ఢిల్లీలో బెల్జియం దౌత్య కార్యాలయంలో పని చేస్తున్న ఒక ఉద్యోగి.. చాణక్యపురి ప్రాంతంలో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయం సమీపంలో ఉన్న స్తంభాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు క్రిమినల్ వాంటెడ్గా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశాడు. దీంతో తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంతో కేంద్రం అప్రమత్తం అయింది.
ఇది కూడా చదవండి: Spider Web: ఉక్రెయిన్ గూఢచారిని గుర్తించిన రష్యా.. దేశ వ్యాప్తంగా వేట!
ఢిల్లీ పోలీసులు సీసీకెమెరాలను పరిశీలించారు. తెల్లవారుజామున పోస్టర్లు అంటిస్తున్నట్లుగా కనిపెట్టారు. అతడు బెల్జియం దౌత్య కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగిగా గుర్తించారు. ప్రస్తుతం అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టర్ల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకుంటున్నారు. అయితే ఈ పోస్టర్లు గత వారమే అంటించగా తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఇక ఈ ఘటనకు సంబంధించిన నివేదికను పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమర్పించారు. ఈ విషయాన్ని బెల్జియం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక కార్యకలాపాలను బెల్జియం పలు సందర్భాల్లో బహిరంగంగా ఖండించింది.