
YS Jagan : కొన్ని రోజులు మంట మీద పడ్డ మిరపకాయలాగా… చిటపటలాడిపోతారు. హాట్హాట్గా, ఘాటుగా కనిపిస్తారు. అంతలోనే… ఐస్ ముక్క పెట్టినట్టుగా కూల్ కూల్ అంటారు. పార్టీ వీడినా ఆ మాజీ ఎంపీని పాత బంధం అంత తేలిగ్గా వదలడం లేదా? గిల్లుకోవడాలు, గిచ్చుకోవడాలు, ఫైరైపోవడాలు అంతకంతకూ పెరుగుతున్నాయా? సడన్గా తన మాజీ బాస్ మీద ఆ మాజీ ఎంపీకి ఎదుకు ప్రేమ పుట్టుకొచ్చింది? ఎవరాయన? గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ ఆఫీస్ ఎగ్జిట్ డోర్ వెదుక్కున్న నేతలు చాలామందే ఉన్నారు. అలా రాజీనామా చేసిన చాలామంది ఇతర పార్టీల్లోకి చేరిపోవటమో.. లేక రాజకీయంగా సైలెంట్ గా ఉండిపోవటమో చేస్తున్నారు. కానీ.. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన… ఇంకా చెప్పాలంటే వైసీపీలో నంబర్ టూ అని చెప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. ఆయన అంతరంగం ఏంటో అర్ధంగాక సతమతం అవుతున్నారట ఫ్యాన్ లీడర్స్. పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. తాను ఇక రాజకీయాల్లో కొనసాగనని, ఏ పార్టీలో చేరేది లేదని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పేశారు సాయిరెడ్డి. ఇక తనమీదున్న కేసు విచారణకు హారవుతున్నారాయన. ఈ క్రమంలోనే… కాకినాడ సీపోర్టు కేసులో విచారణకు వచ్చిన సాయిరెడ్డి… ఊహించని విధంగా లిక్కర్ కేసు గురించి మాట్లాడ్డం అప్పట్లో కలకలం రేపింది. అసలు ఆ రోజు విజయసాయిరెడ్డి అందించిన తీగతోనే… సిట్ మద్యం కేసు డొంక కదిలించగలుగుతోందన్న అభిప్రాయం ఉంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో.
YS Jagan: కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ, మీరే జడ్జిమెంట్ ఇస్తారా…?
నాటి నుంచి మొదలై జగన్కు అత్యంత దగ్గరి వ్యక్తుల దాకా వచ్చేసింది అరెస్టుల పర్వం. ఆ తర్వాత వైసీపీ వర్సెస్ సాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరుగుతోంది. ఇటీవల టీడీపీ నేత టీడీ జనార్ధన్తో విజయసాయి భేటీ అయ్యారని, టీడీపీ డైరెక్షన్లోనే మాజీ ఎంపీ నడుస్తున్నారంటూ ఆరోపిస్తోంది వైసీపీ. దానిపై ముందు సైలెంట్గానే ఉన్నా… ఆ తర్వాత రియాక్టయ్యారు సాయిరెడ్డి. ఆ ఎపిసోడ్ అలా జరుగుతున్న క్రమంలోనే మాజీ సీఎం జగన్పై సాయిరెడ్డి చేసినట్టుగా… కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటికి కూడా తాజాగా ఎక్స్లో వివరణ ఇచ్చారు సాయి. వైఎస్ కుటుంబంతో తనకు మూడు తరాల సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చారు. ఇందులో ఆయన పదాలు, జగన్ను ఉద్దేశించి రాసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. సాయిరెడ్డి పెట్టిన తాజా ఎక్స్ మెసేజ్ చూస్తుంటే… ఈయన ఆయనేనా? సడన్గా ఇంత వినయ విధేయ సాయిగా ఎలా మారిపోయారంటూ మాట్లాడుకుంటున్నారట పొలిటికల్ పండిట్స్. తాను జగన్కి హాని తలపెట్టే పని ఏదీ చేయబోనని, ఆయనకు వ్యతిరేకంగా…ఇప్పటిదాకా పల్లెత్తు మాట అనలేదన్నది ఈ ఎక్స్ మెసేజ్ సారాంశం. ఫలానా రోజున జగన్ అరెస్ట్ అవుతారంటూ తాను సన్నిహితులతో అన్నట్టుగా కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోందని, అదంతా పనిలేని వాళ్ళు చేసే ప్రచారం అంటూ మండిపడ్డారాయన.
అసలు జగన్కి వ్యతిరేకంగా తాను ఎప్పుడు, ఎక్కదా చెప్పలేదని కూడా వివరణ ఇచ్చుకున్నారు సాయి. నాకు తేడా వచ్చింది కూడా పార్టీ అధ్యక్షుడితో కాదు…. ఆయన చుట్టూ ఉన్న కోటరీతోనే అని కూడా క్లారిటీ ఇచ్చేశారు మాజీ ఎంపీ. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా తాను జగన్కు హాని కలిగించే పనులు ఎప్పుడూ చేయబోనని కూడా ఎక్స్ మెసేజ్లో రాసుకొచ్చారు విజయసాయి. ఇది మాత్రం నోట్ చేసుకోవాల్సిన పాయింటేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ మీద తనకు కోపం లేదంటూనే…చుట్టూ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ద్వారా… ఆయన ఒక పద్ధతి ప్రకారం మెసేజ్లు పెడుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. అసలు ఆ కోటరీనే పొద్దస్తమానం తనను కెలికి జగన్కు నష్టం చేయాలని చూస్తోందని చెప్పుకురావటం వెనక గట్టి వ్యూహమే ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కాకున్నా….. మరో రోజయినా తన మాటలు జగన్ చెవికెక్కించుకుంటే ఆ కోటరీ పని ఖతం అవుతుందన్న ఉద్దేశ్యంతోనే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా తాను మౌనంగా ఉండటం వైసీసీలోని కోటరీకి నచ్చడం లేదంటూ సాయిరెడ్డి కొన్ని విషయాలను ప్రస్తావించారు. వైసీపీ సోషల్ మీడియాలో తనమీద అబద్దపు పోస్టులు, దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారాయన.
2011 లో 21 కేసులు నామీద వేసుకున్నా.. 2025లో కూడా జగన్ అడిగి ఉంటే నాకు సంబంధం లేకున్నా బాధ్యత తీసుకుని ఉండేవాడినని, కానీ కోటరీలోని వారే తనకు వెన్నుపోటు పొడిచారని, వాళ్ల మాటలు నమ్మి మూడు తరాలుగా ఆ ఫ్యామిలీకి సేవచేసిన తనను జగన్ పక్కన పెట్టారన్నారు సాయిరెడ్డి.. కేసులు నెత్తిన వేసుకుంటే మంచివాడ్ని.. లేకపోతే మోసగాడు, వెన్నుపోటుదారుడు అని ప్రచారం చేయడం సబబేనా అంటూ కోటరీని కూడా ప్రశ్నించారు సాయిరెడ్డి. అసలు లిక్కర్ స్కామే లేదని జగన్ అంటుంటే, ఆ స్కామ్ వివరాలు టీడీపీ వాళ్లకు చెప్పానని కోటరీ అంటోంది. స్కామే లేనప్పుడు నేను వాటి వివరాలు ఎలా చెబుతానంటూ గన్ను జగన్ చుట్టూ ఉన్నవాళ్ళవైపునకు తిప్పారు సాయిరెడ్డి. మొత్తం మీద ఈ ఎపిసోడ్లో విజయసాయి ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకున్నట్టు కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. జగన్ విషయంలో… తాను అప్పుడు.. ఇప్పుడు వినయ విధేయలతోనే ఉన్నానని, కోటరీనే తమ మధ్య గ్యాప్ తీసుకురావడంలో సక్సెస్ అయిందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారాయన. ముందు ముందు ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుంద చూడాలి.
Spider Web: ఉక్రెయిన్ గూఢచారిని గుర్తించిన రష్యా.. దేశ వ్యాప్తంగా వేట!