
గాంధీ నగర్: యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐపీఎల్ 2025 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. 2025, జూన్ 3 రాత్రి 7.30 గంటలకు ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరుజట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడంతో.. ట్రోఫీ లక్ష్యంగానే ఆర్సీబీ, పంజాబ్ బరిలోకి దిగుతున్నాయి. అయితే.. కీలకమైన ఫైనల్ పోరుకు ముందు ఆర్సీబీ అభిమానులకు ఒక టెన్షన్ పట్టుకుంది.
అదేంటంటే.. స్టార్ ఆల్ రౌండర్ టీమ్ డేవిడ్ ఫైనల్ మ్యాచ్ ఆడతాడా లేదా అని. మే 23న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో టిమ్ డేవిడ్ గాయపడ్డాడు. తొడ కండరాల గాయం కారణంగా ఆర్సీబీ ఆడిన చివరి రెండు మ్యాచులకు ఈ డేరింగ్ అండ్ డాషింగ్ ఆల్ రౌండర్ దూరమయ్యాడు. ఇప్పటి వరకు టిమ్ డేవిడ్ గాయంపై ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో అతడు కీలకమైన ఫైనల్ మ్యాచ్ ఆడతాడా లేదా అని అభిమానుల్లో అయోమయం నెలకొంది.
కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం.. టిమ్ డేవిడ్ ఫిట్ అయ్యాడని.. అతడు ఫైనల్ మ్యాచ్లో బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్కు ముందు జరిగిన ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్లో టిమ్ డేవిడ్ గురించి మాట్లాడిన ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ ఏది క్లారిటీ ఇవ్వేలేదు. టిమ్ డేవిడ్ గాయం గురించి నాకు సమాచారం లేదా అని పటిదార్ చెప్పడంతో ఈ బిగ్ ఆల్ రౌండర్ బరిలోకి దిగుతాడా లేదా అనే దానిపై సందేహాలు మొదలయ్యాయి.
ఈ సీజన్లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్ కు చేరింది. ఇందులో టిమ్ డేవిడ్ పాత్ర చాలా కీలకం. ఈ ఆల్ రౌండర్ చాలా మ్యాచుల్లో టీమ్కు అండగా నిలిచాడు. దీంతో 18 ఏళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తోన్న ఆర్సీబీ కోసం.. ఈ ఒక్క మ్యాచులో టిమ్ డేవిడ్ బరిలోకి దిగాలని ఆర్సీబీ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. మరీ టిమ్ డేవిడ్ బరిలోకి దిగుతాడా లేదా అన్నది తెలియాలంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే.