
హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలలో మెట్రో పిల్లర్లపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోస్టర్లు వెలిశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన బ్యానర్లు ఏర్పాటు చేశారు ఎంఐఎం కార్యకర్తలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓవైసీ గళం.. శత్రు దేశాన్ని ధీటుగా ఎదుర్కొంటున్న నాయకుడు అని పేర్కొంటూ ఓవైసీని ఉద్దేశించి సారాంశంగా కొన్ని పోస్టర్లు సిటీ రోడ్లపై దర్శనమిస్తున్నాయి.
పాకిస్థాన్ ఉగ్రదాడిని ఇంకా దేశం మర్చిపోలేదు. పహల్గామ్ ఉగ్రదాడికి కేంద్రం కూడా తీవ్ర స్థాయిలోనే స్పందించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో శత్రుమూకల ఆట కట్టించింది.. వారి స్థావరాలను ధ్వంసం చేసింది.. ఎందరో టెర్రరిస్టుల ప్రాణాలు తీసి బదులు తీర్చుకుంది. ఈ క్రమంలోనే శత్రు దేశం పాకిస్థాన్ అరాచకాలపై భారత్ వాదనను ప్రపంచ దేశాల ముందు గట్టిగా వినిపించి హైదరాబాద్ చేరుకున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఈ క్రమంలోనే ఓవైసీని ఉద్దేశిస్తూ హైదరాబాద్ నగరంలోని మెట్రో పిల్లర్లపై ఎంఐఎం కార్యకర్తలు, నేతలు పోస్టర్ల ద్వారా తమ అభిమాన నాయకుడిపై గౌరవాన్ని చాటుతున్నారు.
ప్రపంచ దేశాల ముందు ఓవైసీ పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా తన పదునైన గళం వినిపించడంతో ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శత్రువులకు సరైన విధంగా బుద్ధి చెప్పాలని, మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఇవ్వకూడదని తనదైన శైలిలో ఓవైసీ భారతీయ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వెలసిన ఓవైసీ పోస్టర్లు పార్టీ అభిమానులను, అనుచరులను మరింత ఉత్తేజితులను చేసేలా కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..