
ఖాట్మాండు, జూన్ 3: ఎయిర్ పోర్టులో విమానం దిగిన ఇద్దరు వ్యక్తులు లగేజీ తీసుకుని తోటి ప్రయాణికులతో కలిసి బయటకు వస్తున్నారు. కానీ వీరి ప్రవర్తన అందరి మాదిరి లేదు. దీంతో అనుమానం వచ్చిన ఎయిర్ పోర్టు పోలీసులు వీరిద్దరినీ పక్కకు పిలిచారు. దీంతో ఆ ఇద్దరిలో తత్తరపాటు మరింత ఎక్కువైంది. ఇక పోలీసులు ఆలస్యం చేయకుండా వారిని తనిఖీ చేయగా.. లగేజీలో కనిపించింది చూసి పరేషాన్ అయ్యారు. ఇంతకీ వారి వద్ద ఏం ఉందంటే..
భారత్కు చెందిన ఓ వ్యక్తి నేపాల్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్తో పట్టుబడ్డాడు. నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ ఎయిర్పోర్టులో సోమవారం (జూన్ 2) రాత్రి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో అక్కడి పోలీసులు వారిని తనిఖీ చేయగా.. తనిఖీలో వారిదగ్గర ఏకంగా 10.420 కిలోల మారిజువానా మత్తు పదార్థం దొరికింది. పట్టుబడ్డ వారిలో ఒకరు భారత్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
దాంతో పోలీసులు వారి వద్ద నుంచి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నేపాల్ పోలీసు ప్రధాన కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు అరెస్టయిన వ్యక్తులను థాయ్ జాతీయుడు సోమాస్క్ పాచా (43), భారతీయ వ్యక్తి పెరీరా గిఫిన్ (29)గా గుర్తించారు. వీరిద్దరూ బ్యాంకాక్ నుంచి నేపాల్ ఎయిర్లైన్స్లో డ్రగ్స్తో ఖాట్మండు విమానాశ్రయంలో దిగారని తెలిపింది. తదుపరి విచారణ కోసం పోలీసులు నిందితులు ఇద్దరినీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు అప్పగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.