
న్యూఢిల్లీ: టీమిండియా, ఐపీఎల్పై భారత సంతతి వ్యక్తి, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్కు ప్రజాదరణ గణనీయంగా పెంచడంలో ఐపీఎల్ కీలక పాత్ర పోషించిందని.. అలాగే 2028లో లాస్ ఏంజిల్స్లో జరగనున్న ఒలింపిక్స్లో క్రికెట్ రీ ఎంట్రీ ఇవ్వడానికి టీమిండియానే కారణమని పేర్కొన్నారు. గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మంగళవారం (జూన్ 3) ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య జరుగుతోన్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రిషి సునక్ ఇండియా వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎల్ క్రికెట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసిందని.. ప్రతి క్రికెటర్ తమ కెరీర్లో ఏదో ఒక సమయంలో ఐపీఎల్ ఆడాలని కోరుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఎల్ ఆడిన తర్వాత ఇంగ్లాండ్ క్రికెటర్లు ఆటలో మెరుగుపడుతున్నారన్నారు. గత వారం ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ వన్డే మ్యాచులో ఇంగ్లాండ్ యంగ్ క్రికెటర్ -జాకబ్ బెథెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని.. అతడు ఐపీఎల్లో ఆర్సీబీ తరుఫున ఆడుతున్నాడని గుర్తు చేశారు.
ఐపీఎల్ ఆటగాళ్ల నైపుణ్యాలను మెరుగుపరుస్తోందన్నారు. మహిళా క్రికెట్ వృద్ధికి కూడా ఇండియా దోహదపడిందన్నారు. ఎక్కువ మంది అమ్మాయిలను క్రీడలోకి తీసుకురావడం గొప్ప విషయమని కొనియాడారు. 100 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా క్రికెట్ ఒలింపిక్స్లో తిరిగి రావడానికి ఇండియానే కారణమని ప్రశంసలు కురిపించారు.
విరాట్ కోహ్లీ తన అభిమాన ఆటగాడని.. తద్వారా ఐపీఎల్లో బెంగళూరు తన ఫేవరెట్ టీమ్ అని రిషి సునక్ తెలిపారు. మా అత్త మామలు బెంగుళూరుకు చెందినవారేనని.. అంతేకాకుండా ఆర్సీబీలో ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్ వంటి అనేక మంది ఇంగ్లీష్ ఆటగాళ్ళు ఉన్నారని.. తాను ఆర్సీబీకి మద్దతు ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణమని పేర్కొన్నారు.