
సోషల్ మీడియా కంటెంట్ కు బాగా వైరల్ అవుతుండటంతో ఎంతో మంది యువతీ యువకులు ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. తమకు అవగాహన ఉన్న అంశాలు, వార్తలు, వినోదం మొదలైన డిఫరెంట్ కాన్సెప్ట్స్ లతో వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదిస్తున్నారు. కేవలం పాపులారిటీ కోసమే కాకుండా ఒక ఉపాధి మార్గంగా దీన్ని ఎంచుకుంటున్నారు. అయితే అలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను ఈ మధ్య కొందరు టార్గెట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ సంసాదించిన 17 ఏళ్ల సనా యూసుఫ్ దారుణ హత్యకు గురికావడం సంచలనం సృష్టిస్తోంది. టిక్ టాక్ లో వీడియో కంటెంట్ క్రియేట్ చేస్తూ పాపులారిటీ సంపాదించింది సనా.
ఎవరీ సనా యూసుఫ్:
టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులారిటీ సంపాదించిన సనా.. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ లోని అప్పర్ చిత్రాల్ ప్రాంతానికి చెందిన క్రియేటర్. ఆమె చేసిన వీడియోలకు వేలల్లో, లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ఇన్ స్టా గ్రాం లో కూడా 5 లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. డిజిటల్ క్రియేటర్ గా ఎదుగుతున్న తరుణంలో హత్యకు గురికావడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పటికీ వెల్లడికాలేదు.
సోమవారం (జూన్ 2) సనా యూసుఫ్ తన ఇంట్లో ఉండగా.. దుండగుడు ఇంటికి వచ్చి పాయింట్ బ్లాక్ లో కాల్చినట్లు ద ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక కథనంలో పేర్కొంది. ఆమెను కాల్చి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే హత్య వెనుక ఉన్న కారణం ఇంకా తెలిసిరాలేదని చెప్పారు. అయితే స్థానిక మీడియా రిపోర్ట్ ప్రకారం.. హంతకుడు కుటుంబ బంధువు అయినట్లు పేర్కొన్నాయి.
అప్పర్ చిత్రాల్ సెక్టార్ జీ-13 లో ఉంటున్న సనా యూసుఫ్ ఇంటికి వచ్చిన దుండగుడు.. ఆమెను కాల్చి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృత దేహాన్ని పాకిస్తాన్ మెడికల్ సన్స్ ఇన్స్టిట్యూట్ కు పంపించారు. పరువు హత్య కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇన్ ఫ్లుయెన్సర్ల హత్య ఇది మొదటిది కాదు:
పాకిస్తాన్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల ను హత్య చేయడం ఇది మొదటిది కాదు. పాక్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే క్రియేటర్స్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇటీవలే 15 ఏండ్ల హిరా అనే అమ్మాయిని టిక్ టాక్ చేసిందని పరువు హత్య చేశారు ఆమె కుటుంబ సభ్యులు . లేటెస్ట్ గా సనా యూసుఫ్ కూడా మర్డర్ అవ్వడంతో ఇది కూడా అలాంటి హానర్ కిల్లింగ్ అయ్యుంటుందని అనుమానిస్తున్నారు.