. < 1 minute

మంత్రివర్గ సమావేశం ఈనెల 05వ తేదీన జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను విడుదల చేశారు. రాజీవ్ యువవికాసం, వానాకాలంలో పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై, బనకచర్ల, పోలవరం, విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ధాన్యం కొనుగోళ్లతో పాటు కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టుపై ఈ భేటీలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. లోపాల పరిశీలన, బాధ్యుల నిర్ధారణ, తదుపరి చర్యలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం.

యువత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలు అంశంపై కూడా కేబినెట్ చర్చించనుందని, ఇందులో భాగంగా యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు, స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టుగా తెలిసింది. అలాగే ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన ఉన్నతాధికారుల కమిటీ తన నివేదికను మంత్రివర్గ ఉప సంఘానికి అందజేసింది. ఈ నివేదిక గురించి సిఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో కేబినెట్‌లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందన్నది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో విశ్లేషణ జరుగనున్నట్టుగా తెలిసింది.

పాత పింఛన్ విధానం, ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీల భర్తీ తదితర అంశాలపై తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. అలాగే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో పథకాలకు సంబంధించి కేబినెట్ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని అధికారిక వర్గాల సమాచారం.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.