
- రూ.4,150 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 15 శాతం టారిఫ్కే ఏడాదికి 8 వేల బండ్లు దిగుమతి చేసుకునే వీలు
- అప్లయ్ చేసుకునేందుకు ఇంకో రెండు వారాల్లో ఓపెన్ కానున్న విండో
న్యూఢిల్లీ: ఇండియాలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని పెంచేందుకు ప్రభుత్వం కొత్త స్కీమ్ను తీసుకొచ్చింది. ప్రమోట్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ ఇన్ ఇండియా స్కీమ్ ప్రకారం, కంపెనీలు లోకల్గా మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి కనీసం రూ. 4,150 కోట్లను ఇన్వెస్ట్ చేయాలి. అలా చేస్తే ఏడాదికి 8 వేల ఎలక్ట్రిక్ కార్లను కేవలం 15 శాతం ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించి దిగుమతి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ డ్యూటీ 70–-100 శాతం ఉంది. ఈ స్కీమ్ను గత ఏడాది మార్చి 15న నోటిఫై చేశారు. హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ సోమవారం గైడ్లైన్స్ను వివరించింది. ఈ స్కీమ్ కోసం అప్లయ్ చేసుకోవడానికి విండో ఇంకో 2 వారాల్లో ఓపెన్ అవుతుంది.
120 రోజులు ఓపెన్లో ఉంటుంది. “అర్హత పొందిన కంపెనీలు ఈ స్కీమ్ కింద కనీసం 35,000 డాలర్ల (రూ.30 లక్షల) సీఐఎఫ్ (కాస్ట్, ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులు కలిపి) వాల్యూ ఉన్న కంప్లీట్లీ బిల్ట్-ఇన్ యూనిట్స్ (పూర్తిగా తయారైన)ను 15 శాతం కస్టమ్స్ డ్యూటీకి ఐదేళ్ల పాటు దిగుమతి చేసుకోవచ్చు” అని ప్రభుత్వం ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. అర్హత పొందిన ఒక్కో కంపెనీ గరిష్టంగా రూ.6,484 కోట్లను లేదా స్కీమ్ కింద చేసిన ఇన్వెస్ట్మెంట్ను ఆదా చేసుకోవచ్చని తెలిపింది.
ఈ స్కీమ్కు అర్హత పొందాలంటే కంపెనీ మూడేళ్లలో కనీసం రూ.4,150 కోట్లను (సుమారు 500 మిలియన్ డాలర్లను) ఇన్వెస్ట్ చేయాలి. అప్లికేషన్ అప్రూవల్ డేట్ నుంచి 3 ఏళ్లలో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల తయారీని మొదలుపెట్టాలి. కొత్త ప్లాంట్, మెషినరీ, ఎక్విప్మెంట్, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ)పై చేసే ఖర్చులను ఈ స్కీమ్ కింద చేసే ఇన్వెస్ట్మెంట్-గా పరిగణిస్తారు. కానీ, ల్యాండ్ ఖర్చును పరిగణించరు. అయితే మెయిన్ ప్లాంట్, కొత్త బిల్డింగ్స్ ఖర్చు (పెట్టాలనుకున్న ఇన్వెస్ట్మెంట్లో 10 శాతం కంటే ఎక్కువ కాకుండా) పరిగణనలోకి తీసుకుంటారు.
టెస్లా ప్లాంట్ పెట్టదు..
మస్క్ కంపెనీ టెస్లా ఇండియాలో కార్లను తయారుచేయడానికి ఆసక్తి చూపించడం లేదని , కానీ దేశంలో షోరూమ్స్ ఏర్పాటు చేయాలని చూస్తోందని కేంద్ర హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ హెచ్ డీ కుమారస్వామి సోమవారం పేర్కొన్నారు. టెస్లా ఇండియాలో ఫ్యాక్టరీ కడితే అది యూఎస్కు “అన్యాయం” అవుతుందని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. “టెస్లా… వాళ్లు కేవలం షోరూమ్స్ స్టార్ట్ చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియాలో తయారీ చేపట్టడానికి ఆసక్తి చూపించడం లేదు” అని కుమారస్వామి వివరించారు. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల మాన్యుఫాక్చరింగ్ను ప్రమోట్ చేసే స్కీమ్ గైడ్లైన్స్ను ఆయన సోమవారం ఆవిష్కరించారు.
“ఇప్పటివరకు టెస్లా ఆసక్తి చూపలేదు. ఈ స్కీమ్ కోసం జరిగిన ఫస్ట్ రౌండ్ స్టేక్హోల్డర్ సమావేశంలో మాత్రమే టెస్లా ప్రతినిధి పాల్గొన్నారు. సెకండ్, థర్డ్ రౌండ్లో పాల్గొనలేదు” అని అధికారి ఒకరు వివరించారు. మరోవైపు మెర్సిడెస్ బెంజ్, స్కోడా–ఫోక్స్వ్యాగన్, హ్యుండాయ్, కియా లాంటి గ్లోబల్ కంపెనీలు ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయని కుమారస్వామి సోమవారం పేర్కొన్నారు.