
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కోసం పోరాడిన ఏకైక రాజకీయ పార్టీ సీపీఐ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. నారాయణ జాతీయ జెండాను ఎగుర వేయగా, సయ్యద్ అజీజ్ పాషా అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం నారాయణ మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నియంత పాలనతో తన కీర్తిని తానే పొగొట్టుకున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చి 11 ఏండ్లు అవుతున్నా ఇంకా పేదల బతుకుల్లో వెలుగు రాలేదని పేర్కొన్నారు. మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషామాట్లాడుతూ.. తెలంగాణ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కృషి చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీపీఐ కీలక భూమిక పోషించిందన్నారు.