
- ఇప్పటికే ఢిల్లీలోపైలెట్ ప్రాజెక్టుగా అమలు
- రాష్ట్రంలోనూ తెచ్చేందుకు సీఎస్బీ ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాల కట్టడిలో మరో అధునాత టెక్నాలజీ రాబోతోంది. సైబర్ నేరగాళ్ల బారిన పడిన బాధితులు ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు చేసేలా ‘ఈ జీరో ఎఫ్ఐఆర్’ విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ డిజిటల్ ఎఫ్ఐఆర్ సిస్టమ్ను గత నెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్షా ఢిల్లీలో ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీలో దీనిని అమలు చేస్తున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సైబర్ క్రైం యూనిట్లు కూడా ‘ఈ జీరో ఎఫ్ఐఆర్’ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై దృష్టి సారించాయి. కేసుల దర్యాప్తుకు సంబంధించి న్యాయపరిధి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే వివరాలపై అవగాహన పెంచుకుంటున్నారు. సాధారణ నేరాలతో పాటు సైబర్ నేరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంటారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో నేరం జరిగితే మాత్రమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అయితే సైబర్ నేరాలు ప్రాంతంతో సంబంధం లేకుండా జరుగుతున్నాయి.
నేరగాళ్లు ఎక్కడో ఉంటారు. బాధితులు మరెక్కడో ఉంటారు. దీనివల్ల పోలీస్ స్టేషన్ పరిధి నిర్ధారించే క్రమంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేయాలో బాధితులకు తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేంద్రంగా 1930 హెల్ప్లైన్ సహా రాష్ట్రవ్యాప్తంగా రిపోర్ట్ అవుతున్న సైబర్ నేరాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితుల ఫిర్యాదు ఆధారంగాసంబంధిత పోలీసులకు బదిలీ
సంప్రదాయ పద్ధతుల్లో ఫిర్యాదు నమోదు చేయడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ ప్రతిఒక్కరికి చేరడంతో ఇలాంటి సమస్యలను అధిగమించేలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ఎఫ్ఐఆర్ సిస్టంను ప్రారంభించింది. నేరం ఎక్కడ జరిగినా, ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసేలా ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు.
దీంతో కేసుల దర్యాప్తు వేగవంతం అవు తుంది. ఈ ఎఫ్ఐఆర్కు జ్యూరిస్డిక్షన్ అవసరం లేదు. ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) లో ఫిర్యాదు చేసిన వెంటనే ఈ జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ లేదా 1930 హెల్ప్లైన్ ద్వారా అందిన సైబర్ నేరా ల ఫిర్యాదులు ఎఫ్ఐఆర్లుగా మారిపోతాయి. ఆ తరువాత ఫిర్యాదుదారు పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల పోలీసులకు కేసు బదిలీ అవుతుంది.