
- మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఘటన
- మృతుడిది నల్గొండ జిల్లా కేంద్రం
నల్గొండ అర్బన్, వెలుగు : షిర్డీకి వెళ్లొస్తుండగా కారులో అకస్మాత్తుగా మంటలు రావడంతో టీచర్ సజీవ దహనమైన ఘటన మహారాష్ట్రలోని హుస్మానాబాద్ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపిన ప్రకారం.. నల్గొండ టౌన్ ఏచూరి గార్డెన్ సమీపంలో ఉండే సురేశ్(48) నాలుగు రోజుల కింద స్నేహితులతో కలిసి శిర్డీలో సాయిబాబా దర్శనం కోసం వెళ్లారు. తిరిగి వస్తుండగా ఆదివారం ఉదయం హుస్మానాబాద్ సమీపంలోకి రాగానే కారులో అకస్మాత్తుగా మంటలు రావడంతో డ్రైవర్ తో పాటు స్నేహితులు కారు దిగారు.
సురేష్ దిగేలోపే మంటలు తీవ్రమవడంతో అందులోనే చిక్కుకుని దహనం అయ్యాడు. కాగా అతడు మాడుగుల పల్లి మండలం చెరువుపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతని భార్య జ్యోతి మెడికల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగి. మృతుడికి కొడుకు, కుమార్తె ఉండగా, వీరు డాక్టర్లు. కాగా.. ఇటీవల కూతురు పెండ్లి చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.