రాజన్నసిరిసిల్ల: మద్యానికి బానిసగా మారడంతో తండ్రిని కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దేవునితండాకు చెందిన జటోతు తిరుపతి(43) మద్యానికి బానిసగా మారి కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగేవాడు. ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి మద్యం తాగేవాడు.
మూడు రోజుల క్రితం పది వేల రూపాయలు తీసుకెళ్లి మళ్లీ డబ్బులు కావాలని భార్య అమీనాను వేధించాడు. ఈ విషయంతో తల్లి తన కుమారుడి రాజేశ్కు ఫోన్లో సమాచారం ఇచ్చింది. వెంటనే కారులో కుమారుడు ఇంటికి వచ్చాడు. అదే సమయంలో తల్లితో గొడవ పడుతున్న తండ్రిని కారుతో ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన తండ్రిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మృతుడి అన్న రాములు నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.