
సిద్దిపేట, వెలుగుః తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదర్శవంతమైన లక్ష్యాలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు ప్రత్యేక విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
రంగధాంపల్లి వద్ద తెలంగాణ అమర వీరుల స్మారక స్తూపానికి , ముస్తాబాద్ వద్ద ఫ్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలను సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం. మను చౌదరి, అదనపు కలెక్టర్లు గరిమ అగ్రవాల్, అబ్దుల్ హమీద్, సీపీ అనురాధ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి తో పాటు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.