
నస్పూర్, వెలుగు: ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని హామీలు చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మంచిర్యాలలో 509 మంది, నస్పూర్లో 529 మంది, హాజీపూర్ లో162 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గానికి ఇప్పటి వరకు మొత్తం 3,098 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు చెప్పారు. సంబంధింత అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
పదేండ్లలో ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే
నేరడిగొండ, వెలుగు: పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ మండలానికి ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదని బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆడె వసంతరావు అన్నారు. నేరడిగొండలోని హనుమాన్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో ఎంపీడీవో రాజ్ వీర్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి, లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అప్పట్లో కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ కాలనీ ఏర్పాటుచేసి ప్లాట్లు పంపిణీ చేశామని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే అదే కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని అన్నారు. పదేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలే చెప్పిందే తప్పా ఏ పని చేయలేదన్నారు. మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ఎంపీవో లక్ష్మణ్, పంచాయతీ సెక్రటరీ నర్సారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత రాజశేఖర్ రెడ్డి, సద్దాం, కపిల్ జాదవ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
ఇష్టమున్నోళ్లను ఎంపిక చేసి ఇండ్లు మంజూరు చేశారు
అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని నేరడిగొండ మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన మైనారిటీలు ఎంపీడీవో రాజ్ వీర్ కు వినతిపత్రం అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ఎంపికలో అర్హులైన పేదలను గుర్తించకుండా కమిటీ సభ్యులు వారికి ఇష్టమున్నోళ్లను ఎంపిక చేసి ఇండ్లు మంజూరు చేయించుకున్నారని ఆరోపించారు. మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగిందని.. రీ సర్వే చేయించి, అర్హులైన నిరుపేదలకే ఇండ్లు కేటాయించేలా చూడాలని ఎంపీడీవోను కోరారు.