
- ‘ఎంఆర్ఓ సార్కు’ కొట్టిన ఫోన్పే స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్
- సీఎంవో నుంచి వచ్చిన దరఖాస్తుకు రెవెన్యూ ఆఫీసర్లు రూ.40 వేలు డిమాండ్
- మంచిర్యాల జిల్లా భీమారం తహసీల్దార్ ఆఫీసులో బాహాటంగానే లంచాలు
మంచిర్యాల(జైపూర్), వెలుగు: అవినీతి ఆఫీసర్లు బరితెగిస్తున్నారు. ఎలాంటి భయం లేకుండా లంచం సొమ్మును ఫోన్పే, గూగుల్పే చేయించుకుంటున్నారు. ఆఫీసర్లు నేరుగా తమ అకౌంట్లలోకి, లేదంటే కారు డ్రైవర్లు, తమ సన్నిహితుల ఖాతాల్లోకి డబ్బులను ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం తహసీల్దార్ ఆఫీసులో ఇలాంటి తంతే జరిగింది.
భూ సమస్యల పరిష్కారం కోసం వస్తున్న బాధితుల నుంచి ఆఫీసర్లు భారీగా లంచాలు వసూలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది నవంబర్30న ల్యాండ్ఎక్స్టెండ్కరెక్షన్కోసం బాధితుడి నుంచి తహసీల్దార్ రూ.10వేల లంచం తీసుకున్నట్లు తెలిసింది. కాగా చిదుర్ల భిక్షపతి పేరుతో ‘ఎంఆర్ వో సార్’ అంటూ రూ.10వేలు ఫోన్పే చేశాడు. ఆ స్క్రీన్షాట్ ప్రస్తుతం లోకల్వాట్సప్గ్రూపుల్లో వైరల్ గా మారింది. అదే ఏడాది జనవరి 9న నాలా కన్వర్షన్ కోసం మరో వ్యక్తి నుంచి రూ.10వేలు ఫోన్పే చేయించుకున్నట్లు తెలిసింది.
దీంతో పాటు మండలానికి చెందిన ఓ ఓ వ్యక్తి భూవివాదంపై సీఎంవోలో ఫిర్యాదు చేస్తే అక్కడి నుంచి అధికారులు తహసీల్దార్ ఆఫీసుకు ఎంక్వైరీకి పంపించారు. సమస్య జెన్యూన్అయినప్పటికీ, మోఖా మీద ఎంక్వైరీ చేసేందుకు బాధిత రైతు నుంచి రూ.40 వేలు తహసీల్దార్ తీసుకున్నట్లు తెలిసింది. అలాగే మండలంలోని ఓ గ్రామంలో పట్టాదారు అనారోగ్యంతో బాధపడుతూ మంచంపై నుంచి లేవలేని పరిస్థితిలో ఉంటే అక్కడికి వెళ్లి ఆ భూమిని తమ పేరిట చేయడానికి రూ.15 వేల లంచం తీసుకున్నట్లు బాధితుడి కొడుకు ఆరోపించారు.
గత నెల 8న రెండు ట్రాక్టర్లలో అక్రమంగా మట్టిని తరలిస్తుంటే లోకల్ పోలీసులు పట్టుకొని వాటిని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఆ ట్రాక్టర్లకు ఫైన్ వేసి వదిలిపెట్టేందుకు రెవెన్యూ అధికారులు రిలీజ్ ఆర్డర్ పై సంతకాల కోసం ఎంతో కొంత ముట్టజెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ కారు డ్రైవర్కు ఫోన్పే చేశారు.
ఓ వెంచర్ లో భూములను గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక ప్లాటుకు రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నట్టు ఆ వెంచర్ యజమానులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై ఎంక్వైరీ పేరుతో వసూళ్ల దందాకు తెరతీయడంతో తహసీల్దార్సదానందంపై ఉన్నతాధికారులు ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలిసింది