
ముషీరాబాద్, వెలుగు: బక్రీద్ పండుగ సందర్భంగా గో హత్యలను నిరోధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోలిశెట్టి శివకుమార్ డిమాండ్ చేశారు. యుగ తులసి ఫౌండేషన్, గో రక్షకులు, వివిధ గో సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ‘గో మహాధర్నా’ నిర్వహించారు. గోమాతకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శివకుమార్ మాట్లాడారు.
ఇప్పటికే వేలాది గోవులను పాతబస్తీకి తరలించారని, వాటిని విడిపించేందుకు పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. బక్కచిక్కిన ఆవులను మాత్రమే తీసుకొస్తున్నామని ఎంఐఎం నాయకులు చెప్పడం సరికాదన్నారు. డీసీఎంలలో కొబ్బరి పీచు, అరటి కొమ్మలు కప్పి గోవులను ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. చార్మినార్ సాక్షిగా జరుగుతున్న గో హత్యలకు నిరసనగా జూన్ 7న బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని తెలిపారు.
అలాగే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గోవులను రక్షించడం కోసం హిందూ సంఘాలు చేపట్టే ప్రతి కార్యక్రమంలో యుగ తులసి పాల్గొంటుందన్నారు. నాయకులు విజయరామ్, ఆకుతోట రామారావు, బాలకృష్ణ, బసవరాజ్, జస్మత్, మురళీధర్, కరాటే కల్యాణి, శంకర విద్యా భారతి, కుప్ప శ్రీనివాస్, వినోద్ కుమార్, ఉప్పలపాటి శ్రీనివాస్, చంద్ర స్వామి, శివ పార్వతి తదితరులు పాల్గొన్నారు.