
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులపై త్వరలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వేములవాడ పట్టణ ప్రజలు, భక్తులకు అవగాహన కల్పించనున్నట్లు విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న ఆలయ విస్తరణ, భీమేశ్వరాలయంలో ఏర్పాట్లపై ఆలయ గెస్ట్ హౌస్లో దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు, వీటీడీఏ వైస్ చైర్మన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయాన్ని మూసివేయడం లేదని, స్వామి వారికి నిత్య పూజలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాజన్న ఆలయ విస్తరణ పనులకు రూ.76 కోట్లతో త్వరలో టెండర్లు పిలువనున్నట్లు వివరించారు.
కోడెల మృతి దురదృష్టకరం
రాజన్న గోశాలలో కోడెలు మృత్యువాత పడడం దురదృష్టకరమని దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు వాపోయారు. రాజన్న దర్శనానికి వచ్చిన ఆయన గోశాల ఆవరణను కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటనపై హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. పూర్తిస్థాయి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కోడెలకు జియో ట్యాగ్ చేయడంలో ఆలస్యం జరిగిందని, కోడెల సంరక్షణ కోసం అదనంగా సిబ్బంది కేటాయిస్తున్నామన్నారు.