
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఉగ్రవాద సానుభూతిపరులను భద్రతా దళాలు వేటాడుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్న ముగ్గురు అధికారులపై జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వేటు వేశారు. ముగ్గురిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు గూఢచారులుగా పని చేస్తున్నట్లుగా గుర్తించి వేటు వేశారు.
ఇక పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొ్న్న ఉగ్రవాదులకు ఈ ముగ్గురు అధికారులు సహాయం చేసినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటివరకు 75 మంది ప్రభుత్వ అధికారులకు ఉగ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.
ఇప్పటికే పాకిస్థాన్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లాంటి ఎంతో మందిని నిఘా అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ కోవలో అనేక మంది ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరి భరతం పడుతున్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.