
హైదరాబాద్, జూన్ 3: దేశవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2025) పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్ షీట్లను కూడా ఎన్టీయే అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీ పై అభ్యంతరాలకు రూ.200 చెల్లించి జూన్ 5వ వరకు అభ్యంతరాలను తెలపవచ్చని పేర్కొంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎన్టీయే వెల్లడించింది.
కాగా దేశవ్యాప్తంగా పలు పరీక్షకేంద్రాల్లో మే 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య ఆఫ్లైన్ విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 5,400కు పైగా పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో జరిగింది. అయితే ఈసారి క్వశ్చన్ పేపర్ కాస్త కఠినంగా వచ్చినట్లు విద్యార్ధులు చెబుతున్నారు. గతేడాది జాతీయ స్థాయిలో 17 మంది విద్యార్థులు 720కు 720 మార్కులు స్కోర్ చేయడం పెద్ద దుమారం లేపింది. అయితే ఈసారి 720కు 720 స్కోర్ చేసే సీన్ ఏ మాత్రం కనిపించడం లేదు. 2016, 2017 తర్వాత మళ్లీ 2025లో అంత కఠినంగా పరీక్ష నిర్వహించినట్లు నిపుణులు అంటున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం జూన్ 14న నీట్ యూజీ ఫలితాలు విడుదల కానున్నాయి. నీట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
నీట్ యూజీ 2025 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా
మరోవైపు నీట్ పీజీ ఒకే షిప్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈ) పరీక్షను వాయిదా వేస్తున్నట్లు జూన్ 2న ప్రకటన విడుదల చేసింది. నీట్ పీజీ పరీక్ష గతేడాది రెండు షిఫ్టుల్లో నిర్వహించగా.. ఈ ఏడాది మాత్రం ఒకటే షిఫ్టులో నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల మేరకు నీట్ను ఒకే షిఫ్టులో నిర్వహించేందుకు అదనపు కేంద్రాలు, వనరులు అవసరం అవుతాయని భావించిన ఎన్బీఈ వాటి ఏర్పాట్ల కోసం పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.