
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ పాలుపోసి పెంచుతున్న ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఏకకాలంలో పీవోకేతో పాటు పాక్ లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉగ్ర శిబిరాలపై భారత సాయుధ దళాలు దాడులు చేపట్టారు. అయితే ఇక్కడ భారత ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ లోని కొన్ని విషయాలను బయటకు చెప్పకుండా దాచి ఉంచినట్లు తాజాగా వెల్లడైంది. పాకిస్థాన్ భూభాగంలో జరిగిన దాడులకు మీడియా ముందు వెల్లడించిన దానికి చాలా తేడా ఉన్నట్లు తేలింది.
వివరాల్లోకి వెళితే పాక్ కి గట్టిగా బుద్ది చెప్పాలని నిర్ణయించిన మోదీ సర్కార్ భారత ప్రజలతో పాటు ప్రపంచానికి చెప్పిన దాని కంటే ఎక్కువ నష్టాన్ని పాకిస్థానుకు తన దాడులతో కలిగించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత్ చేపట్టిన దాడులపై పాకిస్థాన్ ప్రభుత్వ అధికారులు తయారు చేసిన డాక్యుమెంట్లలో భారత్ మీడియా ముందు ప్రకటించని దాడులకు సంబంధించిన మ్యాప్స్ చిత్రాలు కూడా ఉన్నాయి. మెుత్తానికి ఇండియా పాక్ లోని 28 ప్రాంతాలపై దాడులు చేసినట్లు పాక్ రహస్య పత్రాల్లో పొందుపరచబడింది.
అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత్ బయటకు వెల్లడించకుండా పాక్ లోని మరో 8 ప్రాంతాలపై కూడా దాడులు చేపట్టిందని తేలింది. పాకిస్థాన్ దీనికి సంబంధించి తయారు చేసిన రహస్య పత్రాల్లో పెషావర్, ఝాంగ్, హైదరాబాద్ (సింధ్), గుజరాత్, గుజ్రాన్వాలా, బహవల్నగర్, అటాక్, చోర్ ప్రాంతాలపై కూడా భారత్ దాడులు చేపట్టినట్లు ఉంది. ఆ నగరాల్లో ఎక్కడెక్కడ ఇండియా దాడులు చేసిందో దానికి సంబంధించిన మ్యాప్స్ కూడా రహస్య పత్రాల్లో చేర్చబడ్డాయి.
కావాలనే భారత ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో చేపట్టిన దాడులకు సంబంధించిన వివరాలను బయటకు ప్రకటించకుండా దాచి ఉంచినట్లు తెలుస్తోంది. అయితే భారత్ ఎంత స్థాయిలో డ్యామేజ్ చేసిందనే విషయాన్ని తనతంట తానుగా పాక్ బయటపెడుతుందనే ఉద్దేశంతోనే ఇండియా ఇలా కొంత సమాచారాన్ని బయటపెట్టకుండా ఉండి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. గతంలో మాదిరిగా పాక్ తనకు భారత దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని బుకాయించకుండా ఉండేలా ఇది చేస్తుందని వారు అంటున్నారు.
భారత్ పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసిన తర్వాత పాక్ ఇండియాలోని అనేక బోర్డర్ నగరాల్లోని సాధారణ పౌరుల నివాసాలతో పాటు ఆర్మీకి చెందిన స్థావరాలపై చేసిన డ్రోన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. అలాగే మే 7న బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే-ఎ-తోయిబా సౌకర్యం వంటి ఉగ్రవాద కేంద్రాలు. ముజఫరాబాద్, కోట్లి, రావలకోట్, చక్స్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్ వంటి తొమ్మిది ప్రదేశాలపై ఏకకాలంలో మిసైళ్లతో భారత ఆర్మీ ఉగ్రవాదులపై నిప్పుల వర్షం కురిపించింది.