
ఏపీలో సంచలనం సృష్టించిన తుని కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును రీ-ఓపెన్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. హైకోర్టులో అప్పీల్కు వెళ్లడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. రైల్వేకోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే యోచనను విరమించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాల్లో అలసత్వం వద్దన్న ప్రభుత్వం… కేసును తిరగదోడే ఉద్దేశం లేదంటూ ప్రకటించింది. అయితే.. తుని కేసును రీ ఓపెన్ చేయనున్నట్లు సోమవారం అధికార వర్గాలు తెలిపాయి.. కేసు తెరపైకొచ్చిన 24 గంటల్లోనే రీఓపెన్ ఆలోచనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. సున్నితమైన కేసును తిరగదోడే ఉద్దేశం లేదంటూ చెప్పింది.. ఈ మేరకు అప్పీల్ ఉపసంహరించుకుంటూ ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది.
కాగా.. 2016 జనవరి 31న కాకినాడ జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పుపెట్టారు ఆందోళనకారులు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ నాడు ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో జరిగిన సభకు వేలాదిగా తరలివచ్చారు. ఆ క్రమంలోనే సభ తర్వాత నిరసనకారులు ఆందోళనకు దిగారు. విశాఖ వైపు వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ బోగీలకు నిప్పుపెట్టారు. పక్కా ప్రణాళిక ప్రకారం పెట్రోల్ బాటిల్స్ తీసుకువచ్చి ట్రైన్ తగలబెట్టారన్న ఆరోపణలున్నాయి. అయితే.. ఈ కేసుపై పలు దశలుగా విచారణ జరిగింది. చివరికి.. 2023 మే 1వ తేదీన విజయవాడ రైల్వే కోర్టు కేసు కొట్టేసింది.
ఆ తీర్పుతో మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా సహా మరికొందరికి ఊరట దొరికింది. అయితే కేసులో విచారణ సరిగ్గా జరగలేదని నాడు రైల్వే పోలీసులపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు తమ ముందు ఉంచలేకపోయారంటూ ఆక్షేపించింది. దీంతో ఇప్పుడు మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చినా.. 24 గంటలు గడిచేలోపే ప్రభుత్వం రీఓపెన్ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..
కాగా.. ఈ విషయంపై వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తుని రైలు దహనం కేసును ప్రభుత్వం రీఓపెన్ చేసిందంటూ పేర్కొన్నారు. రైల్వే కోర్టు కొట్టేసిన కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలని.. ఏపీ ప్రభుత్వం జీఓ 852 విడుదల చేసిందన్నారు. కాపు ఉద్యమంపై చంద్రబాబుకు కోపం ఎందుకు? ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వానికి కక్ష ఎందుకు?.. జీఓ 852 పై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ అంబటి డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..