
అమరావతి: చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపమని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తుని రైలు దగ్ధం కేసుపై మంగళవారం (జూన్ 3) ఆయన మీడియాతో మాట్లాడారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన తుని రైలు దగ్ధం కేసులో కాపు నేత ముద్రగడ పద్మనాధం సహా మరో 40 మందిపై అప్పట్లో కేసు నమోదైందని.. ఆ తర్వాత సరైన సాక్ష్యాలు లేకపోవటంతో కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. అయితే.. తుని రైలు ఘటనపై చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లాలనుకుంటోందన్నారు.
కాపులను బీసీల్లోకి చేరుస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అంశాన్ని మర్చిపోయారన్నారు. దీంతో కాపులను బీసీల్లో చేర్చాలను కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తునిలో భారీ బహిరంగ సభ నిర్వహించారని.. ఆ సభ తర్వాత రైల్వే ట్రాక్పై ప్రమాదవశాత్తూ రత్నాచల్ ఎక్స్ ప్రెస్ తగులబడిందన్నారు. రైలును కాపులే తగులబెట్టారని అక్రమ కేసులు పెట్టారని.. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు.
అప్పట్లో నేను, దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స వంటి కాపు నేతలు హైదరాబాద్లో సమావేశమై.. కాపు నేత వంగవీటి రంగాను కోల్పోయినట్లు ముద్రగడను కోల్పోకూడదని గట్టిగా తీర్మానించుకున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు ముద్రగడపై కక్ష్య కట్టి కేసులు పెట్టారని.. నిరసన కార్యక్రమాల చేస్తే చాలా మంది కాపు నేతలపై అక్రమ కేసులు బనాయించారన్నారు. జగన్ సీఎం అయ్యాక కాపు ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు మొత్తం తీసివేయించారని.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ కేసుపై అప్పీలు చేయాలని జీవో ఇచ్చిందని పేర్కొన్నారు.