
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఒక వర్గా్న్ని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందనే కేసులో అరెస్టైన శర్మిష్ఠ పనోలి మధ్యంతర బెయిల్ రిజెక్ట్ చేసింది కలకత్తా హైకోర్టు. మంగళవారం (జూన్ 3) బెయిల్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం అంటే ఇతరులను బాధ పెట్టడం కాదని సూచించింది.
ఈ కేసును విచారించిన జస్టిస్ పార్థ సారథి ఛటర్జీ ఈ కేసు వాదనల సందర్భంగా.. మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే హక్కు ఉంది. అలాగని ఇతరులను బాధపెట్టాలని కాదు దాని ఉద్దేశం. మన దేశం భిన్న కులాలు, మతాలు, వర్గాలు, తెగల సమ్మేళనం. ఇలాంటి వ్యాఖ్యలు చేసినపుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
‘‘ఇతరులను టార్గెట్ చేస్తూ మీరు చేసిన వీడియో సోషల్ మీడియా ద్వారా చాలా మందిని బాధ పెడుతుంది. అదే సమయంలో కొందరిని రెచ్చగొడుతుంది. అందుకే ఇతరులను బాధపెట్టకూడదు.. చట్టం ప్రకారం నడుచుకోవాలి’’ అని ఈ సందర్భంగా అన్నారు.
శర్మిష్ఠ పనోలి మే 14, 2025న తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ.. పహల్గాం ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. ఆమె ఇస్లాం మతంపై, PBUHపై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆపరేషన్ సిందూర్పై మౌనంగా ఉన్న బాలీవుడ్ యాక్టర్లపై యువతి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఆమె వ్యాఖ్యలపై మైనారిటీ సంఘాలు భగ్గుమన్నాయి. #ArrestSharmishta అనే హ్యాష్ ట్యాగ్ ‘ఎక్స్’లో ట్రెండ్ అయింది. శర్మిష్ఠ పనోలిపై చర్యలు తీసుకోవాలని వజాహత్ ఖాన్ కోల్ కతా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కోల్ కతా పోలీసులు శర్మిష్ఠను గురుగ్రామ్ లో అదుపులోకి తీసుకుని కోల్ కతా తరలించారు. న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు తరలించారు.