
Microsoft Layoffs: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు పరిస్థితులను మరింతగా దిగజారుస్తున్నాయి. ఈ క్రమంలో యూఎస్ టెక్ దిగ్గజ సంస్థలు నిర్థాక్షణ్యంగా తమ తొలగింపులను కొనసాగిస్తూనే ఉన్నాయి. 2025 ప్రారంభం నుంచి వరుస లేఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్న మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా మరింత మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తోంది.
వివరాల్లోకి వెళితే మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 3 శాతం మందిని ఇళ్లకు పంపేసిన టెక్ దిగ్గజం తాజాగా మరో రౌండ్ ఉద్యోగుల తొలగింపులకు ప్రణాళికను సిద్ధం చేసిందని వెల్లడైంది. ఈ క్రమంలో వాషింగ్టన్ స్టేట్ ఉపాది భద్రత విభాగానికి ఇచ్చిన సమాచారం ప్రకారం 305 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈసారి అమెరికాలోని రెడ్ మాండ్ ఆఫీసులోని ఉద్యోగులు ఎఫెక్ట్ అయ్యారు. దీంతో ఇటీవలి వారాల్లో కంపెనీ తొలగించిన ఉద్యోగుల సంఖ్య దాదాపు 2వేల 300కి చేరుకుంది.
తాజా తొలగింపులు గతంలోని 6వేల మందిని ఇంటికి పంపినదానితో సంబంధం లేనిదిగా తెలుస్తోంది. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కంపెనీ ఈ తొలగింపులను పాల్పడిందని తెలుస్తోంది. అయితే కంపెనీ తొలగింపులకు ఏఐ వినియోగం కారణమని నేరుగా ఒప్పుకోనప్పటికీ.. తమ కస్టమర్లకు మెరుగైన సేవలను టెక్నాలజీ ద్వారా అందించాలని నిర్ణయించినట్లు చెబుతోంది. అయితే మనుషులను మాత్రం ముఖ్యమైన, అర్థవంతమైన పనులకు మాత్రమే వినియోగించాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది.
►ALSO READ | ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి విదేశాలకు పెరుగుతున్న డైరెక్ట్ ఫ్లైట్స్..
ప్రస్తుత తొలగింపుల కారణంగా ఏఏ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ప్రభావితం అయ్యారనే విషయాన్ని మాత్రం టెక్ దిగ్గజం వెల్లడించలేదు. ఇతర టెక్ సంస్థలతో తన పోటీని కొనసాగించటానికి వీలుగా ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీ ఉద్యోగుల తొలగింపులకు పాల్పడుతోందని వెల్లడైంది.