
బెంగళూరు తొక్కిసలాట విషయాన్ని సీరియస్గా తీసుకుంది కర్నాటక ప్రభుత్వం. కేబినెట్లో చర్చించి.. కీలక ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. పోలీస్ శాఖలో గతంలో ఎన్నడూ లేనన్ని సస్పెన్షన్లు, అరెస్ట్లకు ఆర్డర్లు ఇచ్చారు.
ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర చోటుచేసుకున్న విషాద ఘటనపై చర్యలు ప్రారంభించింది కర్నాటక ప్రభుత్వం. తొక్కిసలాటలో.. 11మంది చనిపోవడాన్ని సీరియస్గా తీసుకుంది సిద్ధరామయ్య సర్కార్. బెంగళూరు పోలీస్ కమిషనర్తో పాటు తొక్కిసలాటతో సంబంధం ఉన్న ఇతర పోలీస్ ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
సస్పెండ్ అయిన వారిలో.. సీపీ దయానందతో పాటు అడిషనల్ సీపీ, డీసీపీ, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ, క్రికెట్ స్టేడియం పోలీస్ ఇన్ఛార్జి ఉన్నారు. సస్పెన్షనే కాదు.. ఆర్సీబీ ప్రతినిధులు, డీఎన్ఏ ఈవెంట్ మేనేజర్స్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను తక్షణమే అరెస్టు చేయాలని డీజీపీ, ఐజీపీని ఆదేశించారు సీఎం. అడిషినల్ డీజీపీగా ఉన్న సీమంత్ కుమార్ సింగ్ను బెంగళూరు కొత్త సీపీగా అపాయింట్ చేశారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించి.. 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డెడ్లైన్ పెట్టారు సీఎం సిద్దరామయ్య.
తొక్కిసలాటపై.. సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్లో.. ఏ1గా ఆర్సీబీ, ఏ2గా DNA మేనేజ్మెంట్, ఏ3గా కర్నాటక క్రికెట్ అసోసియేషన్ను చేర్చారు. నేరపూరిత నిర్లక్ష్యంగా పేర్కొంటూ పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు.. తొక్కిసలాట ఘటన బాధాకరమంటూ భావోద్వేగానికి లోనయ్యారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అనుకోకుండా జరిగిన ఘటనలో ఎవ్వరినీ తాము బ్లేమ్ చేయకున్నా, ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు.
విక్టరీ పరేడ్ విషాదంగా మారడంతో చనిపోయిన వారికి ఆర్సీబీ యాజమాన్యం పరిహారం ప్రకటించినా.. ప్రభుత్వం చర్యలు మాత్రం ఆగలేదు. అనుకోకుండా జరిగినా.. విషాద ఘటనకు బాధ్యత వహించాల్సిందే అంటోంది సిద్ద సర్కార్. ఈ నెల 10వ తేదీన హైకోర్టులో విచారణ తర్వాత.. తొక్కిసలాటపై ఇంకెన్ని చర్యలు ఉంటాయో చూడాలి..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..