. 5 minutes
Top Headlines 9am On 8th June 2025

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ:
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత 10-15 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్స్ పూర్తిగా నిండిపోయి.. వెలుపల క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 88,257 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 45,068 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు అని టీటీడీ అధికారులు వెల్లడించారు.

గుంటూరు జిల్లాలో మూడు కొవిడ్‌ కేసులు:
కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స కోసం వచ్చిన వారికి కొవిడ్‌ ఉన్నట్లు నిర్దారణ అయింది. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన ఒకరికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. తెనాలి, విజయవాడకు చెందిన మరో ఇద్దరికి కరోనా సోకింది. కొవిడ్‌ వార్డులో ముగ్గురికీ చికిత్స అందిస్తున్నారు. వైరస్ సోకిన ముగ్గురి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత:
బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించారు. ఈ ఉదయం ఆరోగ్యం మరింత విషమించడంతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటికే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గోపినాథ్ కి గతంలో డయాలసిస్ పై చికిత్స అందించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ గెలిచారు. ఆయన మరణ వార్త తెలియగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ (మ) అంబట్ పల్లి వద్ద ఆరుగురు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీం సభ్యులు గజఈతగాళ్లు ,కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ,గోదావరి నీటిలోకి దిగి అంచనా వేశారు. కాగా నది లోపల బోట్స్ తిరిగే అవకాశం లేకపోవడంతో రాత్రి అంతగా సేఫ్ కాదని భావించారు. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాక బృందాలు వెనుతిరిగాయి. శనివారం రాత్రి గాలింప చర్యలు ముందుకు సాగలేదు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు నది వద్దనే తమ పిల్లల ఆచూకీ గురించి ఎదురుచూస్తూ ఏడుస్తూ అక్కడే ఉండిపోయారు. గోదావరి నదిలో నిన్న గల్లంతైన ఆరుగురి యువకుల కోసం నేడు ఉదయం రెండు స్పీడ్ బొట్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు ఎస్డీఆర్ఎఫ్,సింగరేణి రెస్క్యూ,ఫైర్ బృందాలు. గాలింపు చర్యల్లో రక్షిత్ మృతదేహం లభ్యం అయ్యింది. మరో ఐదుమంది యువకుల కోసం గాలింపు చేపడుతున్నారు. యువకుల గల్లంతుతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది.

చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం:
ప్రతీ సంవత్సరం మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొద్ది సేపట్లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. జిహెచ్ఎంసి.. పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ పలు శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్ ల నుంచి చేపమందు పంపిణీ వద్దకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు. 42 క్యూ లైన్ కౌంటర్లలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అన్ని కౌంటర్ల వద్ద ప్రత్యేక పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో చేప ప్రసాద పంపిణీ ప్రారంభించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. CCTV కెమెరాలతో మానిటర్ చేస్తున్నారు. 1000 మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. VIPల కోసం 4 గేట్లు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం 3 గేట్లు ఏర్పాటు చేశారు. అజంతా గేట్ నుంచి సామాన్యులకు ప్రవేశం కల్పించనున్నారు.

ట్రంప్ ముందు భారత్ డిమాండ్:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాల దిగుమతులపై 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ విధించాడు.. ఈ నేపథ్యంలో జులై 9వ తేదీ నాటికి ఈ పన్నులు అమలులోకి వస్తాని ఏప్రిల్ 2వ తేదీన యూఎస్ ప్రెసిడెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ- వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఒప్పందం కొనసాగుతుంది. జూన్ 4వ తేదీన అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి చేరుకుంది. ఒప్పందాల అంశంపై రెండు దేశాల మధ్య ​​ఐదోసారి ముఖాముఖి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా అమెరికా కొత్తగా విధించిన 10 శాతం బేస్‌లైన్ సుంకాన్ని తొలగించడమే కాకుండా.. జూలై 9 నుంచి ప్రతిపాదిత 16 శాతం అదనపు సుంకాన్ని కూడా అమలు చేయకూడదని భారత్ డిమాండ్ చేసింది. అమెరికా ఈ సుంకాలను తొలగించకపోతే, అమెరికన్ వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగించే హక్కు కూడా తమకు ఉంటుందని ఈ సమావేశంలో భారత ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచారు.

కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు:
కొంలబియా సెనేటర్‌, అధ్యక్ష అభ్యర్థి మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బేపై కాల్పులు జరిగాయి. ఓ ర్యాలీలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. అయితే, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం బొగోటా పార్కులో ఓ ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మిగ్యుల్‌ ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తుండగా.. ఓ దుండగుడు ఆయన వెనక నుంచి ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. దీంతో, అధికారులు వెంటనే అప్రమత్తమై మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బేను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బొగోటా మేయర్‌ కార్లోస్‌ గాలన్‌ ఈ విషయన్ని అధికారికంగా ధ్రువీకరించారు. కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటనను మిగ్యుల్‌ పార్టీ కన్జర్వేటివ్‌ డెమోక్రటిక్‌ తీవ్రంగా ఖండించింది. ఇది ఒక రాజకీయ నాయకుడిపై జరిగిన దాడి కాదు.. దేశంలోని ప్రజాస్వామ్యం, స్వేచ్ఛపై జరిగిన దాడిగా పేర్కొన్నారు.

జైషే మహమ్మద్‌ను ముందు మీ దేశంలో అంతం చేయండి:
ఆపరేషన్ సింధూర్ కి భంగపడ్డ పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకునేందుకు అమెరికాలో పర్యటిస్తున్న బిలావల్‌ భుట్టో నేతృత్వంలోని పాక్ అఖిలపక్ష బృందానికి అనూహ్య పరిణామం ఎదురైంది. మొదట మీ దేశంలో ఉన్న జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థను అంతం చేయండి, ఆ తర్వాతే మద్దతు కోసం ప్రయత్నాలు చేయండని అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్‌ షెర్మన్‌ వారికి సూచించారు. అలాగే, ప్రపంచంలోనే కరుడుగట్టిన అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను పట్టించడంలో సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) కి సహాయం చేసిన పాకిస్తాన్‌ డాక్టర్‌ షకీల్‌ అఫ్రీదీని తక్షణమే రిలీజ్ చేయాలని అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్‌ షెర్మన్‌ డిమాండ్‌ చేశారు. ఈ హఠాత్పరిణామంతో పాకిస్తాన్ అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తున్న బిలావల్‌ భుట్టోకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డాడు. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను షెర్మన్‌ తన ఎక్స్‌ (ట్విట్టర్)లో పంచుకున్నారు.

గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతులు:
రాజస్థాన్‌లో ఒక ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఇక్కడ ప్రేమించుకున్న యువతి, యువకుడు కాదు.. ఇద్దరు యువతులు కలిసి గాఢంగా ప్రేమించుకున్నారు. ఝుంఝును జిల్లాలోని మెయిన్‌పురా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లి 15 రోజులు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇప్పటికీ వారిద్దరూ ఝుంఝునులోని మెయిన్‌పురా గ్రామంలో ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇద్దరిలో ఓ యువతికి పెళ్లి సైతం జరిగింది. ఆమె తన భర్తను వదిలేసి స్నేహితురాలి వద్దకు వెళ్లడం గమనార్హం.

కొడుకు సమాధిపై పడి బోరున విలపించిన తండ్రి:
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల భూమిక్ లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడి తండ్రి బిటి లక్ష్మణ్ భావోద్వేగ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో బిటి లక్ష్మణ్ తన కొడుకు సమాధిపై పడి బోరున విలపిస్తున్నాడు.

మణిపూర్‌లో మరోసారి హైటెన్షన్:
మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో మరోసారి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కుకీ, మైటీ వర్గాల మధ్య ఘర్షణలతో భద్రతా బలగాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అయితే, శనివారం రాత్రి అరంబై టెంగోల్ సభ్యుడిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలకు దిగారు. రోడ్లపై టైర్లను తగులబెట్టి, ఏటీ నాయకుడు కనన్ సింగ్ అరెస్టుకు వ్యతిరేకంగా యువకులు, మైటీ స్వచ్ఛంద సేవకులే నిరసనలకు దిగారు. జాతి ఘర్షణలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు తమ గ్రామాలపై దాడి చేశారని కుకీ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఇంఫాల్‌లోని క్వాకీథెల్ ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు.

‘8 వసంతాలు’ నుంచి హార్ట్ టచింగ్ టీజర్ రిలీజ్:
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి తెరకెకిస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక స‌నిల్ కుమార్ లీడ్ రోల్‌లో న‌టిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన చిత్రయూనిట్ తాజాగా మ‌రో అప్‌డేట్‌ వదిలారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రక‌టించారు మెకర్స్. ఈ సంద‌ర్భంగా కొత్త టీజ‌ర్‌ను కూడా పంచుకున్నారు. ఫ‌స్ట్ టీజ‌ర్‌లో క‌థానాయిక‌ను ప‌రిచ‌యం చేసిన టీమ్.. రెండో టీజ‌ర్‌లో హీరో పాత్రను ప‌రిచ‌యం చేసింది. మ‌ధురం అనే షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకున్న ర‌వి తేజ దుగ్గిరాల ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ‘ఊటీకి కొత్తగా వచ్చిన తెలుగు రచయిత అత‌డు. తను పదాలను ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పూలలా ఉంటాయి. అదే కసితో రాస్తే, పిన్‌ పీకిన గ్రనేడ్‌లా ఉంటాయి’ అంటూ మొదలైన ఈ టీజర్ ‘ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు.. చేయాల్సిన ప్రయాణం’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ తో ముగిసింది. ప్రేమ క‌విత్వంతో పొంగిపోయేలా ఉన్న ఈ టీజ‌ర్‌ను మీరు చూసేయండి.

కట్టలన్ మూవీ నుంచి సునీల్ పవర్ ఫుల్ పోస్టర్:
తెలుగు ప్రేక్షకులకు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేెదు. కమెడియన్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. మొదటగా డ్యాన్సర్ కావాలని అనుకున్న ఆయన కమెడియన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలా సినిమాలు సునీల్ కామెడీ వల్లే ఆడాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కమెడియన్,హీరో.. పాత్రలో అలరించిన సునీల్ ‘పుష్ప’ సినిమాతో విలన్‌గా నటించి షాక్ ఇచ్చాడు. ఈ మూవీ ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది.. దీంతో సునీల్‌కి అని పవర్ ఫుల్ పాత్రలు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మళయాళం మూవీ ‘కట్టలన్’ లో నటిస్తున్నాడు సునీల్. ఇది కూడా విలన్ పాత్ర కావడం విశేషం. నయా దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై, షరీఫ్ ముహమ్మద్ నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా హై-యాక్షన్ థ్రిల్లర్ మూవీలో, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సునీల్‌కు సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. మునుపెన్నడూ చూడని స్టైలీష్ లుక్ లో కనిపించాడు సునీల్.

వీరమల్లుపై మండి పడుతున్న సింగిల్ స్క్రీన్స్‌ యాజమన్యం:
పవన్‌ కల్యాణ్‌ నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హరిహర వీరమల్లు’. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ, తొలి భాగం జూన్ 12న రిలీజ్ కానున్నట్లు నిర్మాతలు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ, ఈసారి కూడా కష్టమేనని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంపై డిస్ట్రిబ్యూటర్లు భారీ నమ్మకాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఈ సినిమాతో భారీ లాభాలు వస్తాయని ఆశించారు. కానీ అందరీ ఆశలపై నీళ్లు జల్లుతూ ఈ మూవీ మేకర్స్ అన్నంతపని చేశారు.. రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. దీంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సినీ రంగానికి చెందిన పలువురు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ శ్రీధర్ కూడా ఈ చిత్ర వివాదంపై కామెంట్స్ చేశారు.. ‘వాయిదా అనే ఇష్యూ క్రియేట్ చేసింది ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇద్దరు డైరెక్టర్స్ మాత్రమే. ‘హరిహర వీరమల్లు’ సినిమా ఉందని ప్రతి థియేటర్ కాలి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ నెల అంతా పోయినట్లే. ఈ ఏడాదిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘కోర్టు’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలు మాత్రమే హిట్లుగా నిలిచాయి. హీరోలకు స్టార్‌డమ్ వచ్చిందే సింగిల్ స్క్రీన్స్ వల్ల.. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్‌ను వారు పట్టించుకోవడం లేదు’ అని ఆయన మండిపడ్డారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

 

 

 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.