
మొన్న నంబాల.. నిన్న సుధాకర్.. నేడు భాస్కర్.. వరుసగా జరుగుతూన్న ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టు పార్టీ కీలక నేతలను కోల్పోతోంది. చత్తీస్ఘడ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందాడు. బీజాపూర్ లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం(జూన్ 06) భద్రతా బలగాలు –మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పుల్లో ఆడెల్లు అలియాస్ భాస్కర్ ప్రాణాలు కోల్పోయాడు.
ఆడెల్లు అలియాస్ భాస్కర్ తెలంగాణకు చెందినవారే. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పోచ్చెర ఆయన స్వస్థలం. తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలక నేతగా ఉన్నారు. గతంలో అనేక ఎన్కౌంటర్ల నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. అనేక ఆపరేషన్లలో పాల్గొన్న ఆడెల్లుపై 25లక్షల రూపాయల రివార్డ్ కూడా ఉంది.
ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలం, ఉరుమడ్ల గ్రామానికి చెందిన భాస్కర్ 1995 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని అసలు పేరు మందుగుల భాస్కర్ రావు. ఆయన తండ్రి దుర్గయ్య సిపిఐ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మంచిర్యాల=-కొమరం భీం (ఎంకెబి) డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు. భాస్కర్ ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యునికి పనిచేస్తున్నారు. అతనిపై చత్తీస్గఢ్లో రూ.25 లక్షలు, తెలంగాణలో రూ.20 లక్షలు.. మొత్తం 45 లక్షల రూపాయల రివార్డ్ ఉంది.
తెలంగాణాలో మావోయిస్ట్ పార్టీని బలోపేతం చేసేందుకు భాస్కర్ కీలకంగా పనిచేశారు. అయితే అతని యత్నాలను తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టారు. ప్రస్తుతం భాస్కర్ వయసు 53 సంవత్సరాలు. పార్టీని బలోపేతం చేయడానికి , ఎక్కువ మంది విప్లవ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేటట్లు కృషి చేశాడు. ఆయనపై పోలీసులు నిఘా వేసిన నేపథ్యంలో 2020లో ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్ సమయంలో తిర్యాణి మండల అడవులలో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ప్రధాన నాయకులు, ముగ్గురు కార్యకర్తలు పోలీసుల వలకు చిక్కకుండా తప్పించుకోగలిగారు.
అంతకుముందు మే నెల 21వ తేదీన జరిగిన మరో భారీ ఎన్కౌంటర్లో ఏకంగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు మరణించారు. గడిచిన 17 రోజుల వ్యవధిలోనే ముగ్గురు ముఖ్యనేతలు ఎన్కౌంటర్లో మృతి చెందిన ఘటనలు ఆ పార్టీకి భారీ నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. కాగా, నేషనల్ పార్కు సమీపంలో ఇతర మావోయిస్టు కార్యకర్తల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి
మరో వైపు అడెల్లు భాస్కర్ ను పట్టుకుని కాల్చి చంపినట్టు పౌర హక్కుల సంఘం ఆరోపిస్తోంది. చనిపోయిన అడెల్లు భాస్కర్ తోపాటు చత్తీస్గఢ్ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్ట్ నాయకులు బండి ప్రకాష్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దెడు ఏరియా కార్యదర్శి సీటు, రామన్న డిసి మెంబర్, మున్నా, సునీత, మహేష్ లతో పాటు మరో పది మంది మావోయిస్టు నాయకులకు ప్రాణ హాని ఉందంటున్నారు. పోలీసులు వారికి హాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం సుధాకర్ ను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారు. అలాగే సాయంత్రం భాస్కర్ ను కూడా ఎన్కౌంటర్ పేరుతోనే హత్య చేశారని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఇంకా పోలీసుల అదుపులోని బండి ప్రకాష్, మిగతా మావోయిస్టు నాయకులను ఎన్కౌంటర్ పేరుతోనే హత్య చేసే ప్రమాదముందన్నారు.3 ప్రాణాలతో దొరికిన దొరికిన మావోయిస్టు నాయకులను ఎన్కౌంటర్ చేయడం, రాజ్యాంగ విరుద్ధం చట్ట వ్యతిరేకం అని, దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, ప్రతిపక్ష పార్టీలు దీన్ని ముక్త కంఠం తో ఖండించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ నేతలు డిమాండ్ చేశారు.
ఆపరేషన్ కాగార్ పేరిట నడుస్తున్న ఈ ఆపరేషన్లో ఇంకా తెలంగాణ నుంచి కేంద్ర కమిటీలో క్రియాశీల సభ్యులుగా గణపతి, తిప్పిరి తిరుపతి (అలియాస్ దేవూజీ, మల్లుజోల వేణుగోపాల్ అలియాస్ భూపతి లేదా సోను, హిద్మా, పుల్లారి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న, గణేష్ ఉయ్కే, అనుకుల్ చంద్ర నస్కర్ అలియాస్ పరేష్ డా సెంట్రల్ కమిటీ లో కీలక సభ్యులుగా ఉన్నారు. ఈ వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలతో బయటపడం కష్టంగా అనిపిస్తుందని పౌర హక్కుల సంఘం అనుమానం వ్యక్తం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..