
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా పోలీసుల ఎదుట శుక్రవారం ఏడుగురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో జుగ్లు అలియాస్ సుందుం కొవ్వాసి, దశా అలియాస్ బుర్కు పొడియం, భోజారాం మడవి, లక్మా అలియాస్ సుతీ అలియాస్ లకన్ మార్కం, రాతు అలియాస్ ఒతే కొవ్వాసి, సుఖ్రాం పొడియం, పాండ్రు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రూ. 50 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ అందజేశారు. వీరు మావోయిస్టుల కోసం రోడ్లు తవ్వడం, చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా వేయడం, బ్యానర్లు కట్టడం, కరపత్రాలు పంచడం వంటి పనులు చేసే వారని ఎస్పీ తెలిపారు.
ట్రక్ను తగులబెట్టిన మావోయిస్టులు
చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బైరంగఢ్ నేషనల్ హైవేపై గురువారం అర్ధరాత్రి మావోయిస్టులు ఓ ప్రైవేట్ ట్రక్ను తగులబెట్టారు. సాధారణ పౌరుల వేషధారణలో వచ్చిన మావోయిస్టులు కూలీలతో వెళ్తున్న ట్రక్ను అడ్డగించారు. వాహనంలో ఉన్న కూలీలను కిందకు దించిన అనంతరం దానికి నిప్పు పెట్టి సమీప అడవుల్లోకి వెళ్లిపోయారు.