
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో తెలంగాణ వాసన, సోయిలేని పాలన నడుస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. శుక్రవారం దశరథి జైలు జీవితం గడిపిన నగరంలోని ఖిల్లాను సందర్శించి మీడియాతో మాట్లాడారు. దాశరథి శతజయంతి వేడుకలు పట్టించుకోకపోతే జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించి బుద్ధి చెబుతామన్నారు. ప్రభుత్వం జూలై మొదటివారం లోపు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తన ఎమ్మెల్సీ కోటా నుంచి రూ.40 లక్షలు ఖర్చు చేసి దాశరథి ఆయన సహచర ఉద్యమకారుడు వట్టికోట అళ్వార్స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించామన్నారు.
దాశరథి శతజయంతి వేడుకలు ప్రభుత్వం తరఫున నిర్వహించాలని శాసన మండలిలో ప్రస్తావించగా ప్రభుత్వం స్పందించలేదన్నారు. బిరుదురాజు రామరాజు శతజయంతిని సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆ లిస్టులో దశరథిని చేరనీయమన్నారు. మాజీ మేయర్ నీతూ కిరణ్, మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్రాజు, జాగృతి జిల్లా ప్రెసిడెంట్ అవంతి, స్టేట్ యువజన అధ్యక్షుడు సంపత్గౌడ్ పాల్గొన్నారు. అంతకు ముందు కవిత రెంజల్ మండలం సాటాపూర్ లో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన పూజలకు హాజరయ్యారు.
మత్తడిపోచమ్మ ఆలయ నిర్మాణానికి విరాళం
లింగంపేట, వెలుగు : లింగంపేట సమీపంలో మత్తడిపోచమ్మ ఆలయ నిర్మాణానికి తెలంగాణ జాగృతి యూత్ రాష్ట్ర కన్వీనర్ ఎదురుగట్ల సంపత్గౌడ్ రూ.2.11లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా శుక్రవారం ఆలయకమిటీ సభ్యులకు నిజామాబాద్లోని కవిత నివాసంలో అందజేశారు. కార్యక్రమంలోఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పోతగోని శంకర్గౌడ్,అధ్యక్షుడు దుర్శెట్టి అశోక్, కోశాధికారి గుజ్జరి మారుతి తదితరులు పాల్గొన్నారు.