
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో దేశంలో 764 కొత్త కేసులు నమోదవ్వగా మరో నలుగురు మృతి చెందినట్లు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేరళలో ఇద్దరు,పంజాబ్, కర్ణాటకలలో ఒక్కొక్కరు చనిపోయారని వెల్లడించింది.ప్రస్తుతం భారత్ లో 5,364 యాక్టివ్ కోవిడ్- కేసులు ఉన్నాయి .
అత్యధిక కేసులు కేరళలో నమోదయ్యాయి. ఒకే రోజులో 192 కొత్త కేసులు నమోదయ్యాయి, తరువాత గుజరాత్ (107), పశ్చిమ బెంగాల్ (58) మరియు ఢిల్లీ (30) ఉన్నాయి. పెరుగుతున్న కేసుల కారణంగా ఆసుపత్రులను తనిఖీ చేయడానికి కేంద్రం మాక్ డ్రిల్స్ నిర్వహించింది. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్, ఐసోలేషన్ పడకలు, వెంటిలేటర్లు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
జాగ్రత్త తప్పనిసరి
శ్వాసకోశ సంబంధ వ్యాధిగ్రస్తులతో పాటు వయోవృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, బయటకు వెళ్లినపుడు మాస్కులు ధరించడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలతో కరోనాతో వ్యాప్తి తగ్గుతుందని సలహా ఇస్తున్నారు. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారితో పాటు వృద్ధులు, శ్వాస సంబంధ సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ పరిధుల్లో జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం, బూస్టర్ డోస్ తీసుకోనివారు ఇప్పుడన్నా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేటి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం లేదని, తీవ్ర అనారోగ్యాలకు కారణం కావడం లేదని, అతిగా భయపడవలసిన పని లేదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనం తీసుకునే జాగ్రత్తలు మనకు శ్రీరామ రక్ష అని తెలుసుకుని మసలుకోవాలి.