. 2 minutes

రేషన్ తిప్పలు ఆరు సార్లు బయోమెట్రిక్, ఆరుసార్లు బియ్యం కాంటా

Caption of Image.
  • సర్వర్​ ప్రాబ్లం వస్తే మళ్లీ మొదటికి..
  • ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 దాకా షాప్​లు ఓపెన్​
  • అయినా రోజుకు 30 కార్డులు దాటని పంపిణీ

నిజామాబాద్​/ కామారెడ్డి, వెలుగు:  ఉమ్మడి జిల్లాలో రేషన్​ బియ్యం తీసుకోవడానికి ప్రజలు బేజారవుతున్నారు.  రోజంతా షాప్​ల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పల్లెల్లో నెట్​వర్క్​ సమస్య, కొత్త సాఫ్ట్​వేర్​పై అవగాహన లేక డీలర్లు బయోమెట్రిక్​లతో కుస్తీ చేస్తుండడం కనిపిస్తుంది. బయోమెట్రిక్​, కాంటాలు మూడుసార్లు వేయాల్సి రావడంతో కనీసం ఒక్కరికి 25 నిమిషాలు పడుతోంది.  

సన్నబియ్యం షురూ చేశాక పెరిగిన డిమాండ్..​

నిజామాబాద్ జిల్లాలో 4,02,217 రేషన్​కార్డులుండగా, 13,10,012 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం 759 షాపులుండగా ప్రతి నెలా 8,733 లక్షల మెట్రిక్​ టన్నుల రైస్ అవసరం. గతంలో ప్రతి సభ్యుడికి ఆరు కిలోల చొప్పున దొడ్డు రకం బియ్యం ఇచ్చేవారు. వాటిని ఎక్కువ మంది తినకుండా అమ్ముకునేవారు. డీలర్ల ఆధ్వర్యంలో దందా నడిచేది. ఏప్రిల్ నెల నుంచి స్టేట్ గవర్నమెంట్​ సన్నరైస్​ పంపిణీ షురూ చేశాక డిమాండ్​ పెరిగింది. ఇదివరకు రేషన్​దుకాణాల్లో కోటా వారంలో ముగిసేది. ఇప్పుడు ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వాలని కేంద్ర సర్కార్ ఆదేశించడంతో పరిస్థితి మారింది. ఈ-పాస్ మెషన్​లో కేంద్రం వాటా బియ్యం పంపిణీకి ఒకసారి స్టేట్ షేర్ ఇవ్వడానికి మరోసారి డీలర్లు బయోమెట్రిక్​ తీసుకోవాల్సి వస్తోంది.

 రైస్​ కాంటాలను రెండుసార్లు వేయాల్సి ఉంది.  ఈ రకంగా మూడు నెలల రైస్ పంపిణీకి ఆరుసార్లు బయోమెట్రిక్ వేలి ముద్రలు, ఆరుసార్లు కాంటాలు వేయాల్సి రావడంతో టైం ఎక్కువ తీసుకుంటోంది.  సర్వర్​ సమస్య తలెత్తినప్పుడు మొదటికొస్తుంది. బ్లూటూత్​కు లింక్​ చేసిన కొత్త సాఫ్ట్​వేర్​పై డీలర్లకు ట్రైనింగ్ ఇవ్వకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. టార్గెWట్​ ప్రకారం మూడు నెలల రైస్​ మొత్తం 26,200 లక్షల మెట్రిక్​ టన్నులు ఈ నెల 30 దాకా ఇవ్వడం డీలర్లకు కష్టతరంగా మారింది. కామారెడ్డి జిల్లాలో 2,56,732 కార్డులుండగా 9,35,007 మంది లబ్ధిదారులు ఉన్నారు.   ప్రతి నెలా 5,907 లక్షల మెట్రిక్​ టన్నుల రైస్​ అవసరం కాగా, మూడు నెలల కోటా కలిపి మొత్తం 17,711లక్షల టన్నులు పంపిణీ ప్రహసనంగా మారింది. 

టోకన్​ సిస్టంకు ప్లాన్..​

కోవిడ్ లాక్​డౌన్​ టైంలో 2020 అక్టోబర్​లో సెంట్రల్ గవర్నమెంట్​ రెండు నెలల రైస్​ ఒకేసారి పంపిణీ చేయించింది. రేషన్​ షాప్​లు, స్కూల్​ రూమ్​లు, అంగన్​వాడీ సెంటర్లతో పాటు లోకల్​గా అందుబాటులో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్​ల్లో బియ్యం బస్తాలు  అన్​లోడ్​ చేసి చకాచకా నాలుగు రోజుల్లో పంపిణీ ముగించారు.  మధ్యాహ్నం అరగంట భోజన విరామం తప్పితే ఉదయం 8 గంటలకు తెరిచిన  షాప్​లు రాత్రి 10 గంటల వరకు 30 కార్డులకు పంపిణీ  దాటడం లేదు. ఎండకు తోడు ఉక్కబోత వాతావరణంలో నిలబడలేక సంచులు క్యూలో పెట్టి  నీడ వెతుక్కుంటున్నారు.

 కొందరు రోజంతా నిరీక్షించిన ఉత్తి చేతులతో వెళ్లి మరుసటి రోజు దుకాణం ఓపెన్​ చేయకముందే వచ్చి కూర్చుంటున్నారు. జిల్లాలో ఒక షాప్​కు కనీసం 500 నుంచి గరిష్ఠంగా 800 కార్డులున్నాయి. వీటింన్నిటికీ నెల రోజుల్లో పంపిణీ పూర్తి చేయడానికి టోకన్ సిస్టం పెట్టాలని యోచిస్తున్నారు. రోజుకు 25 కార్డుల చొప్పున పంపిణీకి ప్లాన్​ చేశారు.

డిలే కానీయం

రైస్​ పంపిణీకి నిర్ధిష్ఠ విధానం ఉంది. షాప్​ల్లో స్టాక్​ పూర్తయిన కొద్దీ రైస్ పంపుతాం. ఎక్కడా సమస్య రాకుండా సాఫీగా పంపిణీ జరిగేలా పర్యవేక్షిస్తున్నం. – మల్లికార్జునబాబు, డీఎస్​వో, కామారెడ్డి

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.