. 2 minutes

Ind vs Eng

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్ గడ్డపై భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనున్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య సుదీర్ఘ సిరీస్ జరుగనుంది. ఇరు జట్లకు ఇది చాలా కీలకమైన సిరీస్ అని చెప్పొచ్చు. జూన్ 20 నుంచి లీడ్స్‌లో జరిగే టెస్టుతో సిరీస్‌కు తెరలేస్తోంది. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టుతో జరుగనున్న సిరీస్ టీమిండియాకు సవాల్‌గా మారింది. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లపై భారత బ్యాటర్లు ఎలా రాణిస్తారనే దానిపైనే జట్టు గెలుపోటములు ఆధారపడి ఉంటాయి.

ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగనుంది. రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, మహ్మద్ షమి వంటి సీనియర్ క్రికెటర్లు సిరీస్‌లో ఆడడం లేదు. అశ్విన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశారు. షమి ఫామ్‌లో లేకపోవడంతో సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఇలా కీలక ఆటగాళ్లు దూరం కావడంతో టీమిండియా బలహీనంగా మారింది. ముఖ్యంగా విరాట్ లేని లోటును భర్తీ చేయడం భారత్‌కు చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పాలి.

భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన విరాట్ అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అతని లేని లోటు జట్టుపై స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఎలాంటి బౌలర్‌నైనా సమర్థంగా ఎదుర్కొనే సత్తా కోహ్లికి ఉంది. అతను లేకుండా ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును ఎదుర్కొవడం టీమిండియాకు సవాల్ వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రోహిత్ శర్మ కూడా అందుబాటులో లేకుండా పోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఫార్మాట్ ఏదైనా తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగిపోవడం రోహిత్‌కు వెన్నతో పెట్టిన విద్య.

ఆడింది కొన్ని టెస్టులే అయినా రోహిత్ జట్టుపై తనదైన ముద్ర వేశాడు. అతని సేవలు అందుబాటులో లేక పోవడం భారత్‌కు అతి పెద్ద లోటుగా చెప్పక తప్పదు. అశ్విన్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జట్టును మరింత కలవరానికి గురి చేసే అంశమని చెప్పాలి. భారత క్రికెట్‌పై అశ్విన్ చెరగని ముద్ర వేశాడు. ముఖ్యంగా టెస్టుల్లో అశ్విన్‌కు కళ్లు చెదిరే రికార్డు ఉంది. పలు మ్యాచుల్లో జట్టుకు ఒంటిచేత్తో విజయం సాధించి పెట్టిన ఘనత అశ్విన్‌కు ఉన్న సంగతి తెలిసిందే. అతనిలాంటి స్పిన్నర్ దొరకడం చాలా కష్టంతో కూడుకున్న అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షమి వంటి స్టార్ బౌలర్ సేవలు కూడా జట్టుకు ఉండడం లేదు. ఇలా కీలక ఆటగాళ్లు లేకుండానే టీమిండియా టెస్టు సిరీస్ బరిలోకి దిగుతోంది.

గిల్‌కు సవాల్..

మరోవైపు రోహిత్ శర్మ స్థానంలో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్‌కు ఈ సిరీస్ పరీక్షగా మారింది. కీలక ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతుండడం, ప్రత్యర్థి చాలా బలమైంది కావడం వంటి కారణాలతో గిల్‌కు సిరీస్ ప్రతిష్ఠాత్మకంగా తయారైంది. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్‌లపై జట్టును ముందుండి నడిపించాల్సిన పరిస్థితి గిల్‌కు ఏర్పడింది.

గిల్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి టెస్టు సిరీస్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అతను జట్టును ఎలా నడిపిస్తాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం జట్టులో కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు మాత్రమే అనుభవజ్ఞులుగా ఉన్నారు. మిగతా క్రికెటర్లకు టెస్టుల్లో పెద్దగా అనుభవం లేదు. ఇలాంటి స్థితిలో జట్టును విజయపథంలో నడిపించడం గిల్‌కు శక్తికి మించిన పనిగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.