కాళేశ్వరం వివాదంలోకి తనను లాగుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageshwar Rao) అన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల అబద్దాలు చెప్పారని.. సబ్ కమిటీకి కాళేశ్వరానికి సంబంధం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డకు అనుమతులు ఇచ్చిన తర్వాత కమిషన్ వేశారని తెలిపారు. ఈటల రాజేందర్ చేసిన ప్రకటన అవాస్తవమని.. కమిషన్ ముందు అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏంటని.. ప్రశ్నించారు. ఈటెల తన వాంగ్మూలాన్ని అనాలోచితంగా ఇచ్చారా లేక ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయా అని అడిగారు.
తప్పుడు ప్రకటనలతో ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరని పేర్కొన్నారు. తాను సుమోటోగా కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్తానని మంత్రి తెలిపారు. కాళేశ్వరంపై సబ్కమిటీ ఎప్పుడూ నివేదిక ఇవ్వలేదని.. అందుకు సంబంధించిన వివరాలన్నీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ప్రాణహితపై మాత్రమే స్టేటస్ రిపోర్టు ఇచ్చామని.. పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రమే కమిషన్ వేశారని పేర్కొన్నారు.