
రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ విస్తరణ.. రాత్రికి హైదరాబాద్కు గవర్నర్
రేపు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. నిన్న ఢిల్లీకి వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. ఈరోజు రాత్రికి హైదరాబాద్ రానున్నారు. అయితే, కొత్తగా కేబినెట్ లోకి ముగ్గురిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మంత్రివర్గంలో కూడికలు, తీసివేతలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇద్దరు మంత్రులను తప్పించే ఆలోచనలో ఏఐసీసీ ఉన్నట్లు టాక్. సామాజిక న్యాయం కూర్పులో భాగంగా మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్ నియామకం కూడా పూర్తి చేయాలని యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అయితే, కేబినెట్ లోకి ముగ్గురు లేదా నలుగురు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలు ఉండగా, బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ లకు చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం.
కాళేశ్వరం నిర్మాణానికి నాకు సంబంధం లేదు.. ఈటల వాంగ్మూలం అసత్యం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమీషన్ కు ఇచ్చిన వాగ్మూలం అసత్యం అన్నారు. అలాగే, కాళేశ్వరం కమిషన్ దగ్గర తన పేరు ఎందుకు ప్రస్తావించారో తెలియదన్నారు. ఈటల అనాలోచితంగా ఇచ్చారా? చాలా రోజులు అయ్యింది కాబట్టి అలా ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితులు దాపురించాయా? అని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమీషన్ అడిగిన ప్రశ్నలకు ఈటల ఇచ్చిన సమాధానాలు వాస్తవ దూరంగా ఉన్నాయి.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వేసిన సబ్ కమిటీ కాదు.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం సబ్ కమిటీ వేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇక, సబ్ కమిటీ నాలుగు ప్రాజెక్టుల నిర్మాణాలపై నిర్ధారణ చేసి నివేదిక ఇచ్చింది అని మంత్రి తుమ్మల అన్నారు. కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందని ఈటల రాజేందర్ చెప్పడం అబద్ధం.. కాళేశ్వరం నిర్మాణం కోసం క్యాబినెట్ ఆమోదానికి ఎప్పుడూ రాలేదు అని తేల్చి చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో మాత్రమే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని ఆరోపించారు.
బనకచర్ల ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు!
బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదు అని తేల్చి చెప్పారు. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దు.. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరుతున్నాను.. ఎందుకు బనకచర్ల ప్రాజెక్టును నిలిపి వేయాలనే దానిపై పూర్తి వివరాలతో జల వనరుల శాఖను కలవాలి అని కోరారు. బనకచర్ల ప్రాజెక్టు వలన తెలంగాణకి ఏ విధంగా నష్టం జరుగుతోందో డీటెయిల్డ్ గా లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేశారు. అయితే, గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ ఇచ్చిందని అన్నారు. కేంద్రం ఇంకా ఆ రిపోర్ట్ పరిశీలించలేదు.. బనకచర్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ చదవలేదు.. అధ్యయనం చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటుంది.. కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోంది అని కిషన్ రెడ్డి తెలిపారు.
అమరావతి మహిళలను కించపరచడం దుర్మార్గం.. అనగాని సత్యప్రసాద్ ఫైర్
అమరావతి మహిళలను కించపరచడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. అమరావతి మహిళలను అత్యంత దారుణంగా కించపరచడం నీచాతినీచం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ కు, ఆయన పేటీఎం బ్యాచ్ కు ఇంత కన్నా మంచి మాటలే రావా. ఇంతలా విషం కక్కుతారా. చివరకు మహిళలను కించపరచడం వైసీపీ చిల్లర బుద్ధికి నిదర్శనం. సీఎం చంద్రబాబు చెప్పినట్టు అమరావతి నిజంగానే దేవతల రాజధాని. రాజధానిని నిర్మించడానికి మేం చాలా రకాలుగా కష్టపడుతున్నాం. కానీ జగన్ బ్యాచ్ ఇలాంటి వాటితో వివాదాలు సృష్టిస్తున్నారు. అమరావతి మహిళల ఉసురు కారణంగానే 11 సీట్లకు పడిపోయారు. అమరావతి మహిళలను ఇంకా అవమానిస్తే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు. ఐదు కోట్ల మంది ఆంధ్రులకు అమరావతియే రాజధాని. మన రాజధాని మనకు ఎప్పటికీ ఉండిపోతుంది.
పవన్ కల్యాణ్ చెప్పినా మారరా.. ఇసుక మాఫియాపై వర్మ కామెంట్స్..
పిఠాపురంలో ఇసుక మాఫియాపై ఎస్వీఎస్ ఎన్ వర్మ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పిఠాపురంలో గత ఐదేళ్లలో ఉన్న ఇసుక మాఫియానే మార్పులు, చేర్పుల పేరుతో ఇప్పుడు కూటమి పార్టీల్లోకి వచ్చి అదే దందాను కొనసాగిస్తోందన్నారు. వాళ్లు ఇలా చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వర్మ విమర్శించారు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటే నాలుగు రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాడు. కానీ ఇసుక మాఫియాను మాత్రం పోలీసులు పట్టించుకోవట్లేదు. పవన్ కల్యాణ్ గారు ఇప్పటికే చెప్పారు. పిఠాపురంలో ఒకే ఒక్క చెరువుకు పర్మిషన్ ఇచ్చారు పవన్ కల్యాణ్. అది కూడా బట్టీలకు మాత్రమే. కానీ రోజూ 200ల లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. పోలీసులు వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు. పోలీసులు మారాలంటూ పవన్ కల్యాణ్ ఇప్పటికే సూచించారు. అయినా వారిలో మార్పు రావట్లేదు. వారు మాఫియాను అడ్డుకోవట్లేదు అంటే వారికి రావాల్సింది వారికి వచ్చేసినట్టే’ అని ఎస్వీఎస్ ఎన్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెన్షన్లను తగ్గించిన ఘనత బాబుదే.. సీదిరి అప్పలరాజు కామెంట్స్..
వైసీపీ ఇచ్చిన పెన్షన్ల కంటే కూటమి ప్రభుత్వం తక్కువ ఇస్తోందని.. ఈ ఘనత చంద్రబాబుదే అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారంటూ దుయ్యబట్టారు. 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇస్తా అన్న చంద్రబాబు.. ఇప్పుడు అతిగతి లేకుండా వదిలేశారంటూ మండిపడ్డారు. ఇంటింటికి పెన్షన్స్ ఇచ్చే విధానం పోయిందని.. వృద్దులు, వికలాంగులు ఎండలలో ఉంటూ ఇబ్బడి పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పెట్టుబడిదారులు భయపెడుతున్నారని తెలిపారు. దావోస్ కు వెళ్లిన చంద్రబాబు, లోకేష్ ఖాళీ చేతులతో వచ్చారు. ఏమైనా ప్రశ్నిస్తే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఉచిత సిలెండర్ అన్నారు.. ఫ్రీ బస్ అన్నారు. అన్ని హామీల్లోనూ వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగులకు భృతి, అమ్మకు వందనం, రైతులకు పీఎం కిసాన్ కిసాన్ ఇవ్వకుండా మోసం చేశారు.
రాహుల్ గాంధీ ‘‘రిగ్గింగ్’’ కామెంట్స్పై ఎన్నికల సంఘం ఆగ్రహం..
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర ఎన్నికల సంఘం( ECI) తీవ్రంగా ఖండించింది. గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘‘రిగ్గింగ్’’ చేయబడ్డాయని ఆయన వ్యాఖ్యానించడాన్ని ఈసీ తోసిపుచ్చింది. ఓటర్లు మోసపోయారనే ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. “ఓటర్లు ఏదైనా ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత, ఎన్నికల సంఘం రాజీపడిందని చెప్పడం ద్వారా దాని పరువు తీయడానికి ప్రయత్నించడం పూర్తిగా అసంబద్ధం” అని పోల్ సంఘం తన బలమైన పదాలతో కూడిన సమాధానంలో పేర్కొంది. దీనికి ముందు, రాహుల్ గాంధీ ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరించిందని, ఓటర్ల జాబితాలను నకిలీ ఓటర్లతో పెంచారని ఆరోపించారు. ఈ వాదనలపై ఈసీ స్పందిస్తూ.. మొత్తం ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, అన్ని రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు హాజరైనట్లు పేర్కొంది. అసాధారణ ఓటింగ్ గురించి కాంగ్రెస్ అధీకృత ఏజెంట్లు ఎప్పుడూ ఎటువంటి అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు లేవనెత్తలేదని కమిషన్ పేర్కొంది.
భారత్కు రష్యా Su-57 ఫైటర్ జెట్ ‘‘సోర్స్ కోడ్’’ ఆఫర్.. అంగీకరిస్తే ‘‘ అత్యాధునిక టెక్నాలజీ’’ మన సొంతం..
యుద్ధ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ పైనే యుద్ధాలు ఆధారపడుతున్నాయి. దీంట్లో భాగంగానే పలు దేశాలు తమ సైన్యంలో ఐదో తరం ఫైటర్ జెట్లు ఉండాలని కోరుకుంటున్నాయి. ప్రస్తుతం 5వ తరం యుద్ధ విమానాలు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సొంతగా తయారు చేసుకున్నాయి. భారత్ కూడా ఈ ఫైటర్ జెట్ డెవలప్మెంట్ పాజెక్టును ప్రారంభించింది. ఇదిలా ఉంటే, రష్యా నుంచి భారత్ కు బిగ్ ఆఫర్ లభించింది. రష్యా తన ఆధునాతన ఐదో తరం యుద్ధ విమానం Su-57 సోర్స్ కోడ్ను భారత్కి ఆఫర్ చేసింది. చైనా, పాకిస్తాన్ నుంచి ముప్పును ఎదుర్కొంటున్న భారత్కి రష్యా నుంచి వచ్చిన ఈ ఆఫర్ చాలా ప్రయోజనకరమని చెప్పాలి. Su-57E యొక్క సోర్స్ కోడ్కు యాక్సెస్ అనేది భారత్ తన ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అభివృద్ధిలో స్వయంప్రతిపత్తికి కీలకంగా మారే అవకాశం ఉంది. రష్యా యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ చేసిన ఈ ప్రతిపాదన ఇప్పుడు కీలకంగా మారింది. మేకిన్ ఇండియా పోగ్రాం కింద భారత్లోనే జెట్స్ తయారీ చేస్తామనే ప్రతిపాదన కూడా చేసినట్లు తెలుస్తోంది.
ట్రంప్ ‘‘బిగ్, బ్యూటిపుల్ బిల్లు’’తో భారతీయులు పంపించే నిధులపై ప్రభావం..
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘బిగ్, బ్యూటీఫుల్ బిల్లు’’ ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, ఈ బిల్లుపై ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. అయితే, ఈ బిల్లు ఇప్పుడు భారత్కి వచ్చే నిధులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచ రెమిటెన్స్(విదేశాల్లో పనిచేస్తున్నవారు స్వదేశంలోని తమవారికి పంపే నిధులు) ప్రవాహాలను మార్చే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి. ప్రపంచంలోనే అమెరికా నుంచి రెమిటెన్స్ స్వీకరించే అగ్రదేశంగా భారత్ ఉంది. 2024లో భారత్కు ఏకంగా 129 బిలియన్ డాలర్లకు పైగా నిధులను, ఆ దేశంలో ఉంటున్న మనవాళ్లు పంపించారు. మే 22న, యుఎస్ హౌస్ 215-214 తేడాతో బిల్లును ఆమోదించింది. రెమిటెన్స్ బదిలీలపై 3.5 శాతం పన్నును విధించే నిబంధన ఈ బిల్లులో ఉంది. ముందుగా, 5 శాతం ఉన్నప్పటికీ, ఒత్తిడి కారణంగా దీనిని తగ్గించారు.
హరిహర వీరమల్లుపై వివాదం చేసిన వాళ్ళు కన్నప్పపై ఎందుకు వివాదం చేయలేకపోతున్నారు?
టాలీవుడ్ కు సనాతన ధర్మం పట్ల చులకన, హేళన, అవమానపరిచే భావనతో పనిచేస్తుందని, దీనికి ఎన్నో సినిమాలు ఉదాహరణగా ఉన్నాయని, ఎందుకు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు సనాతన ధర్మాలను కించపరిచే సన్నివేశాలు పెడుతుంటే ఎందుకు నోరు మెదపటలేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి టాలీవుడ్ ను ప్రశ్నించారు. మంచు మోహన్ బాబు, విష్ణు చలనచిత్ర పరిశ్రమలో అరాచకాలు సనాతన ధర్మాన్ని కించపరిచే సన్నివేశాలు, బ్రాహ్మణ కులాన్ని అవహేళన చేస్తూ అవమానిస్తూ చిత్రాల నిర్మిస్తుంటే సినీ పరిశ్రమ పెద్దలు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ సినిమాలపై కోర్టులు మొట్టికాయలు వేసిన సరే చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ సిగ్గు వస్తుందని శ్రీధర్ ప్రశ్నించారు. గత వారం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లు సినిమాపై సినీ ఇండస్ట్రీలో కొన్ని వర్గాల పెద్దలు వివాదం చేశారని, అదే పెద్దలు కన్నప్ప సినిమాపై ఎందుకు వివాదం చేయలేకపోతున్నారని శ్రీధర్ ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ ను అవమానించాలని సినీ రంగ పెద్దలు వివాదం చేశారా అని శ్రీధర్ ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చులకన,హేళన భావంతో ఉన్నట్లుగా భావిస్తున్నట్లు శ్రీధర్ తెలియజేశారు.
ఈ తరానికి కన్నప్ప కథ చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడు!
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ, “మా కన్నప్ప ఫస్ట్ రోడ్ షో ఇదే, గుంటూరులో జరిగింది. దానికి థాంక్స్. ఈ రోజు కన్నప్ప సినిమా చేసి ఈ రోజు ముందు నిలబడడానికి చాలా మంది సహకరించారు. నాకు మా నాన్న దేవుడు, ఆయన లేకపోతే నేను లేను. ఆయనకు మొదటి థాంక్స్. ఇక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నా మిత్రుడు ప్రభాస్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రభాస్ కన్నప్పలో చేయడానికి కారణం, అతనికి నాన్నగారి పైన ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానం తప్ప, ఇంకా వేరే ఏమీ కాదు. ఇప్పటికీ స్నేహానికి ఇంత విలువ ఉందంటే, అది ప్రభాస్ లాంటి వాళ్ల వల్లే. వీరందరూ అతని స్టార్డమ్ కాదు, వ్యక్తిగా అతనిని ప్రేమించాలి. ప్రతిసారి మనందరికీ నిజంగా దేవుడు ఉన్నాడా అనే అనుమానం ఉంటుంది. అక్కడ నుంచే భక్తి పుడుతుంది. దేవుడే లేడన్న కోపం నుంచి ఆ తర్వాత మనందరం దేవుడివి దాసోహం అవుతాం. కన్నప్ప కూడా అంతే. ఈ జర్నీ వ్యక్తిగతంగా నన్ను విపరీతంగా మార్చింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకి కన్నప్ప మళ్లీ ఈ రోజు ఈ సినిమాతో తిరిగి వస్తున్నాడు. ఇది శివుడు 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథ మళ్లీ చెప్పరా అని నన్ను ఎన్నుకున్నాడని నేను అనుకుంటున్నాను.