
బెంగుళూర్: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగుళూర్లోని చినస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంచుతున్నట్లు ప్రకటించింది. తొలుత మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ఎక్స్గ్రేషియాను రూ.25 లక్షలకు పెంచింది.
కాగా, 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఎట్టకేలకు ఐపీఎల్ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. 2025, జూన్ 3న జరిగిన ఫైనల్ మ్యాచులో పంజాబ్ను చిత్తు చేసి.. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్నా ఐపీఎల్ టైటిల్ను ఆర్సీబీ దక్కించుకుంది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో జట్టు ఆటగాళ్లను సత్కరించేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్సిఎ) బుధవారం (జూన్ 4) చినస్వామి స్టేడియంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియం వద్ద తండోపతండాలు ఎగబడ్డారు. స్టేడియం కెపాసిటీ 30 వేలు ఉంటే.. దాదాపు 3 లక్షల మంది వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి.. 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న కర్నాటక హైకోర్టు.. కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. అందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు తొక్కిసలాట ఘటనకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఆర్సీబి బృందం, కెఎస్సీఎ, డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను, విజయోత్సవ ర్యాలీ నిర్వాహకులు DNA ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ముగ్గురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య రిటైర్ట్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించారు. కమిటీ నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.