. < 1 minute

ఆరు గ్యారెంటీలతో ప్రజలను, ఆశపెట్టి ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నాయకులు శనివారం నిజామాబాద్ క్యాంపు కార్యాలయంలో ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు. ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడంతో పాటు డి.ఎలు ఎప్పటికప్పుడు చెల్లిస్తామని, పిఆర్‌సి ద్వారా మెరుగైన ఫిట్‌మెంట్ ఇస్తామనే హామీలతో పాటు ఉద్యోగులకు ఎన్నో వాగ్దానాలు చేసిందని గుర్తు చేశారు. ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా ఐదు డి.ఎలను పెండింగ్‌లో పెట్టి ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు. జులై ఒకటిన చెల్లించాల్సిన మరో డి.ఎను కలువుకుంటే మొత్తం ఆరు డి.ఎలను ఈ ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ పడిందని చెప్పారు.

ఇప్పుడు ఒక జి.ఒ ఆరు నెలల తర్వాత ఇంకో జి.ఒ ఇస్తామని ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం అంటే ఉద్యోగులను వంచించడమే అని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలతో సామాన్య ప్రజలకు దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగులను అలాగే మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పిఆర్‌సి వేయలేదన్నారు. కనీసం మధ్యంతర భృతి ఇచ్చే ప్రయత్నం చేయకపోగా ఉద్యోగులను నిందించేలా ప్రభుత్వం మాట్లాడుతోందని చెప్పారు. దసరా పండగలోపు పెండింగ్‌లో ఉన్న ఆరు డి.ఎల్లో మూడు డి.ఎలు ఇవ్వకపోతే ఉద్యోగుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. వెంటనే పిఆర్‌సి నియమించి ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్ ఇవ్వాలని, పిఆర్‌సి అమలు చేసే వరకు ఉద్యోగులకు ఐఆర్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంఎల్‌సి కవితను కలిసిన వారిలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు నాగరాజు, రేవంత్ తదితరులు ఉన్నారు.

 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.